నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: కరోనా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది మాత్రమే ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి ఆలయం, వికాస్నగర్లోని కార్యసిద్ధి క్షేత్రంలో, హౌసింగ్ బోర్డు కాలనీలోని శారదాదేవి ఆలయం, విద్యానగర్లోని సాయిబాబా ఆలయంలోని అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిర్వహించారు. మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను తహసీల్దార్ వెంకట్రావు అందజేశారు. ఆలయ చైర్మన్ నర్సింహులుగౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. బీర్కూర్తో పాటు ఆయా గ్రామాల్లో హనుమాన్ దీక్ష చేపట్టిన మాలధారులు మంగళవారం దీక్ష విరమణ చేపట్టారు. కొండగట్టు హనుమాన్ ఆలయానికి భక్తుల రాకను నిషేధించడంతో మాలధారులు తమ గ్రామంలోనే మాల విరమణ చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో కొంతమంది గ్రామ పెద్దలు రథాన్ని ఉన్న చోటనే కొంచెం కదిలించి రథోత్సవాన్ని నిర్వహించారు. విగ్రహ ఊరేగింపులో కూడా కొంత మంది మాత్రమే పాల్గొన్నారు. బాన్సువాడ పెద్ద హన్మాన్ మందిరం, పాతబాన్సువాడలోని హన్మాన్ మందిరం తదితర గ్రామాల్లో జయంతిని భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, పిట్లం తదితర అన్ని మండలాల్లో భక్తులు తమ ఇండ్ల వద్దనే హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు.