ఎదురులేని ప్రజానాయకుడు , తిరుగులేని కథానాయకుడు, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజా లోకం మొత్తం ఆయనను స్మరించుకుంటుంది. కుటుంబ సభ్యులే కాక ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్తో కరచాలనం చేస్తున్న ఫొటోని షేర్ చేసిన మెగాస్టార్ .. “ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటున్నట్టు తన పోస్ట్లో పేర్కొన్నారు.
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ గుండెని , ధరిత్రిని మరొక్కసారి తాకిపో తాతా అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ , నారా రోహిత్ కూడా తమ తాతను స్మరించుకున్నారు.