హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత రెండేండ్లల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ఉద్యానశాఖ ఈ యాసంగిలో 32 జిల్లాల్లో దాదాపు 52 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయాల పంటలు సాగు పెంచాలని ప్రణాళికను సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. యాసంగిలో నీటిఎద్దడి సమస్య కారణంగా సన్న, చిన్నకారు రైతులంతా వరిని సాగు చేయకుండా, కూరగాయల పంటలు సాగు చేయాలని కోరారు. కూరగాయల సాగును పెంచడానికి రాయితీలు కల్పిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు ఐదెకరాల వరకు 50% సబ్సిడీ అందించనున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా మామిడి, డ్రాగన్, అవకాడో, బత్తాయి, అరటి, జామ, బొప్పాయి తదితర పండ్ల తోటలకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ. 32 వేలు, పుట్టగొడుగుల పెంపకానికి ఎకరాకు రూ.1 లక్ష నుంచి రూ.12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్టు వివరించారు. కూరగాయల సాగు ఎకరాకు రూ.9,600, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, సుగంధ ద్రవ్యాలు ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.