కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ప్రముఖ బెంగాల్ సినీనటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపారు. ‘ నేటితో తృణమూల్తో ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. పార్టీలో ఏ కీలక పదివి లేనందున వాటికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లుగా రేడిఘి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించాను. ప్రస్తుతం అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను.
సుధీర్ఘ కాలం ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు’ అంటూ లేఖలో ఆమె పేర్కొన్నారు. రేడిఘి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు దేబశ్రీ రాయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. శాసనసభ ఎన్నికలకు ముందు తృణమూల్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు 20 మంది ఆ పార్టీని వీడారు. రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి, ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిశ్రా, ల్యాండ్ మినిస్టర్ అబ్దుల్ రజాక్ మొల్లా, వ్యవసాయ శాఖ మంత్రి పుర్ణెందు బసు ఈ జాబితాలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. తృణమూల్, బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో బరిలో దిగగా.. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూటమిగా పోటీకి దిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 45 స్థానాలు గెలిచి సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది.