Tech layoffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత (Tech layoffs) కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా వందలాది కంపెనీలు.. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
టీసీఎస్లో 12వేల మంది ఔట్..!
కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని ఆయన అన్నారు. ఉద్యోగుల సంఖ్యను ఎందుకు తగ్గించవలసి వస్తోందన్న ప్రశ్నకు యావత్ ఐటీ పరిశ్రమ మార్పు చెందుతున్నదని, పని చేసే విధానాలు మారుతున్నాయని ఆయన బదులిచ్చారు. 2025 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.13 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2 శాతం మంది అంటే సుమారు 12,200 మంది ఉంటారు. లేఆఫ్లు జూనియర్ లెవెల్లో కాకుండా మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ లెవెల్స్లో అధికంగా ఉంటాయని కృతివాసన్ స్పష్టం చేశారు.
మైక్రోసాఫ్ట్లో 9 వేల మందికి ఉద్వాసన
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది. దీంతో సుమారు 9 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ తొలగింపులు Xbox, గేమింగ్ విభాగాల్లో ఉండనున్నాయి. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, మైక్రోసాప్ట్ ఈ ఏడాది మే నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్లు ఇచ్చింది. అంటే దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరి, జూన్ నెలల్లో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. డైనమిక్ మార్కెట్లో పోటీదారుగా నిలవడానికి, కంపెనీ పునర్ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూన్నాం’ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఇంటెల్లో 20 శాతం కోత
మరోవైపు, ఈ ఏడాది సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇటీవల ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు లేఆఫ్స్కు ప్రభావితం కానున్నారు. సమర్థతను పెంచి, చిన్న బృందాలతో వేగంగా పనిచేయడమే తమ లక్ష్యమని కంపెనీ నూతన సీఈవో లిప్-బు టాన్ పేర్కొన్నారు.
ఐబీఎమ్లో 8 వేల మందిపై వేటు..
టెక్ దిగ్గజం ఐబీఎమ్ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (IBM Layoffs) తొలగించినట్లు సమాచారం. దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిసింది. లేఆఫ్స్కు గురైన వారిలో ఎక్కువ భాగం హెచ్ఆర్ విభాగం (HR department) నుంచే ఉన్నట్లు తెలిసింది. ఆటోమేషన్ ప్రచారంలో భాగంగా ఐబీఎమ్ ఇటీవలే హెచ్ఆర్ సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ (AI) వ్యవస్థలతో భర్తీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 200 మంది స్థానాలను ఏఐతో భర్తీ చేశారు.
అమెజాన్, గూగుల్, మెటా..
ఇవేకాకుండా అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్లలో వందమంది వరకూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ 27 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. జూన్లో దాదాపు 100 మంది ఉద్యోగులపై వేటు వేసింది.రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గింపు ప్రణాళిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14,000 మందిని తగ్గించాలని యోచిస్తోంది. అంటే దాదాపు 13 శాతం అన్నమాట.
ఈ ఏడాది ప్రారంభంలో మెటా 3 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. కాగా, ప్రసూతి, మెడికల్ లీవ్లో ఉన్నవారినీ తొలగించారని విమర్శలు వచ్చాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్.. క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ కారణంగానే ఈ నిర్ణయమని తెలిపింది. లేఆఫ్స్తో ఉద్యోగుల గుండెల్లో ఏఐ గుబులు నెలకొంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో వణికిపోతున్నారు టెకీలు.
Also Read..
Speaker Om Birla | లోక్సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
Shashi Tharoor | ‘మౌనవ్రతం.. మౌనవ్రతం’.. పార్లమెంట్ బయట మీడియాతో శశిథరూర్ చమత్కారం.. Video