లక్నో, సెప్టెంబర్ 17: జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు జీఎస్టీ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇవి ఇక నుంచి 5 శాతం జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు శుక్రవారం లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై కొత్త పన్నులేవీ విధించడం లేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డరు చేసే ఫుడ్పై 5 శాతం జీఎస్టీ ఉన్నది. ఇప్పటివరకూ ఫుడ్ ఆగ్రిగేటర్ల ఆన్లైన్ బిల్లుల ద్వారా వసూలుచేసే పన్నుల్ని వాటి భాగస్వామ్య రెస్టారెంట్లకు చెల్లిస్తే, ఆ మొత్తాన్ని రెస్టారెంట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. జీఎస్టీ కొత్త సవరణ ప్రకారం ఫుడ్ ఆగ్రిగేటర్లు పన్నును వసూలుచేసి జనవరి 1 నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సివుంటుంది.
రెమిడిసివిర్, టోసిలిజుమాబ్, ఆక్సిజెన్, ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, ఇతర కొవిడ్ అత్యవసరాలపై పన్ను తగ్గింపు గడువును జీఎస్టీ కౌన్సిల్ ఈ ఏడాది డిసెంబర్ చివరివరకూ పొడిగించినట్లు సీతారామన్ తెలిపారు.
వచ్చే ఏడాది జూన్ నుంచి రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం ఉండదు. వివిధ రాష్ట్ర పన్నుల్ని జీఎస్టీలో విలీనంచేసినందున రాష్ర్టాల ఆదాయంలో ఏర్పడే తగ్గుదల మొత్తాన్ని కేంద్రం 2022 జూన్ వరకూ ఆయా రాష్ర్టాలకు చెల్లించేలా గతంలో నిర్ణయించారు. ఈ చెల్లింపు ప్రక్రియ వచ్చే ఏడాదితో ముగుస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ పరిహారం చెల్లింపు కోసం కొన్ని లగ్జరీ, హానికారక ఉత్పత్తులపై వసూలుచేసే సెస్ను మాత్రం 2026 మార్చివరకూ వసూలుచేస్తారు.