తెలంగాణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆసరా ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవీ రోగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా దాదాపు 40లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారు.వీరికోసం బడ్జెట్లో ఏటా రూ.12వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రూపాయికి కిలో బియ్యం, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, విదేశాలకు వెళ్లి చదువుకొనే వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం, రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): 1.. 2.. 3.. 4.. 6.. వివిధ రంగాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ర్యాంకులివీ. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను చూసి ఐక్యరాజ్యసమితి, నీతి ఆయోగ్ సంయుక్తంగా ప్రకటించిన ర్యాంకులివీ. మన ప్రగతికి మచ్చుతునకలివీ. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొంటున్న నిర్ణయాలకు ప్రతిరూపాలివీ. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో తెలంగాణ దూసుకెళ్తున్నది. ఏటికేడు కొత్త లక్ష్యాలను చేరుకొంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. తాజాగా, ఐక్యరాజ్యసమితి, నీతి ఆయోగ్ రూపొందించిన 2020-21లో మొత్తంగా 69 పాయింట్లతో మన రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. కిందటి సంవత్సరం కంటే రెండు పాయింట్లు అధికంగా సాధించి ముందుకెళ్లింది. క్లీన్ ఎనర్జీలో వందకు వంద మార్కులు సాధించి తొలిర్యాంకు, తాగునీరు-పారిశుధ్యంలో రెండో ర్యాంకు, శాంతిభద్రతలు-మౌలిక సదుపాయాల్లో((కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, ఆర్థికాభివృద్ధి) మూడో ర్యాంకు, లైన్ ఆన్ ల్యాండ్(జీవవైవిధ్యం, అడవుల సంరక్షణ) విభాగంలో నాలుగో ర్యాంకును తెలంగాణ సాధించింది. వీటికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు.
ఇందులో అనేక రంగాల్లో రాష్ట్రం వృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. మొత్తం 115 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. నివేదికలో.. తెలంగాణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, అనేక పథకాలను బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఆసరా పింఛన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవీ రోగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా దాదాపుగా 40 లక్షల మంది వరకు పింఛన్లను అందిస్తున్నారు. వీరికోసం బడ్జెట్లో ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు కేటాయించింది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, గర్భిణులు, పిల్లలకు కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రూపాయికి కిలో బియ్యం, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, విదేశాలకు వెళ్లి చదువుకొనే వారికి రూ.20లక్షల ఆర్థిక సహాయం, రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని వెల్లడించారు.
నివేదికలో ముఖ్యాంశాలు:
ఇది మూడో జాబితా
నీతిఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల జాబితాను తొలిసారిగా 2018 డిసెంబరులో విడుదల చేశారు. ప్రపంచస్థాయిలో సమాజ, పర్యావరణ అభివృద్ధికి ఐక్యరాజ్యసమితి తదితర సంస్థలు నిర్దేశించిన లక్ష్యాలను సాధించటంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు.. మొత్తంగా భారతదేశం ఏ మేరకు ముందుకు వెళ్తున్నది అన్నది తెలుసుకోవటం కోసం దీనిని ప్రారంభించారు. దీని రూపకల్పనలో దేశంలోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల, నిపుణుల సాయం తీసుకున్నారు. ప్రస్తుతం విడుదలైన జాబితా మూడోది.