TTD | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారిని ఆగస్టులో దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు ఆన్లైన్ కోటా షెడ్యూల్ ప్రకటించారు. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడీప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సేవా లక్కీడీప్ చెల్లింపు వ్యవధి ఈ నెల 20 నుంచి 22 వరకు ఉంటాయని వివరించారు. శ్రీవారి ఆర్జిత, కల్యాణం, ఊంజల్, బ్రహ్మోత్సవం, స్వచ్ఛంద సేవలతో పాటు వార్షిక పవిత్రోత్సవం టికెట్లు (ఆగస్టు 15-17) ఈ నెల 21 ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.
అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 23 ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి కోటా ఉదయం 11 గంటలకు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లు, మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి కోటా అందుబాటులో ఉంటుందన్నారు. 27న శ్రీవారి, స్వచ్ఛంద సేవా జనరల్ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్నట్లు పేరొన్నారు.