Free Bus For Women | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి మహాలక్ష్మీ స్కీం కింద తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు లబ్ధి పొందటమేమో కానీ.. మొదటి నుంచి విపరీతమైన వివాదాలు చోటుచేసుకొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. మొదట్లో బస్సు ఆపట్లేదని డ్రైవర్లపై.. టికెట్లు అడుగుతున్నారంటూ కండక్టర్లపై దాడులకు దిగగా.. మధ్యలో ప్రయాణికులు సీట్ల కోసం సిగలు పట్టుకుని పొట్టుపొట్టుకొట్టుకొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి మొదటికి వచ్చింది. హైదరాబాద్ లక్డీకాపూల్లో ఆర్టీసీ బస్సు ఓవర్ లోడ్ అయిందని ఓ మహిళను బస్సు ఎకించుకునేందుకు డ్రైవర్ నిరాకరించారు. దీంతో.. తనను ఎందుకు ఎకించుకోరు అంటూ సదరు మహిళా.. బస్సుకు అడ్డం తిరిగి ముందుకు వెళ్లకుండా చేసి.. ఆ ఆర్టీసీ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.
బస్సు పూర్తిగా నిండిపోయిందని.. నిలబడటానికి కూడా స్థలం లేదని.. ఎకితే తనకే కాక బస్సు నడిపేందుకు కూడా ఇబ్బంది అవుతుందంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ మహిళ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు నీదా అంటూ డ్రైవర్ మీదికి సదరు మహిళ ఎదురు తిరిగింది. ఒక ఆ మహిళే అనుకొంటే.. బస్సులోని మహిళలు కూడా ఆమెకు వంతపాడుతూ… ఉచితబస్ ఎవరు పెట్టమన్నారంటూ మండిపడ్డారు. దీంతో.. తీవ్ర అసహనానికి లోనైన ఆ బస్సు డ్రైవర్.. ఇక నేను బస్సును నడపలేను బాబోయ్.. నువ్వే బండి తీసుకుని పో.. అంటూ బస్సును రోడ్డుపైనే వదిలేసి.. దిగి వెళ్లిపోయాడు. గురువారం జరిగిన ఈ తతంగాన్ని అదే బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది కాస్త వైరల్అవుతున్నది. కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.