లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్తుత్తి పోరాటం నడుస్తున్నదా? బీఆర్ఎస్ను గెల్వనివ్వకూడదనే ఏకైక లక్ష్యంతో రెండు పార్టీలు మిలాఖత్ పాలిటిక్స్ చేస్తున్నాయా? గత నాలుగైదు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఈ రకమైన సందేహాలనే కలిగిస్తున్నాయి. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్న రీతిలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర రాజకీయం తమచుట్టూ మాత్రమే తిరిగేలా చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే కేసీఆర్ బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి రావడంతో వాటిఎత్తుగడలు విఫలమయ్యాయి.
కృష్ణానదిపై పెత్తనాన్ని తెలంగాణ చేతి నుంచి గుంజుకోవాలని కేంద్రం పదేండ్లుగా ప్రయత్నించింది. కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేసింది.
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్కైవేలు నిర్మించుకుంటామని.. కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం పదులసార్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ, రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అంతే.. భూములను ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకున్నది.
BJP-Congress | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయం నడుస్తున్నదా? దేశవ్యాప్తంగా కత్తులు దూసుకుంటున్న పార్టీలు.. తెలంగాణలో కరచాలనంతో కథ నడిపిస్తున్నాయా? రాజకీయ రణక్షేత్రంలో ఇరు పార్టీలు విమర్శలను వదిలేసి.. ‘డూప్ ఫైట్’తో ఓటర్లను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నయా? అంటే.. రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. తెలంగాణలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే.. ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా సాగుతున్న ‘భాయీ.. భాయీ’ తరహా రాజకీయం ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నది. బీఆర్ఎస్పై ప్రజల్లో చర్చ జరగకుండా జాతీయ పార్టీలు రెండూ ‘పరస్పర సహకార’ పద్ధతిలో పనిచేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాగునీరు లేక పంటలు ఎండిపోయి, నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ యాత్రలు చేపట్టిన సమయంలో.. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. అయితే కేసీఆర్ వైపు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రెండు పార్టీలు అలా వ్యవహరించాయన్న విమర్శలూ అప్పట్లో వ్యక్తమయ్యాయి. మోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని మోసం చేశారని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని, ప్రతి ఒకరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ఇవ్వలేదని, ప్రజలపై రూ.100 లక్షల కోట్ల రుణభారం మోపారని, విభజన హామీలు ఇవ్వలేదని.. ఇలా సీఎం రేవంత్ ఆ సమయంలో అనేక విమర్శలు చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు బీఆర్ఎస్ను అనుకరిస్తూ ఆఫీసుల్లో కూర్చొని రైతు దీక్షల పేరుతో డ్రామాను రక్తికట్టించారని వారు చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఒక్క బీజేపీ నేత కూడా పొలాలకు వెళ్లి ఎండిన పంటలను ఎందుకు పరిశీలించలేదని, రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మార్చి 4న ఆదిలాబాద్లో జరిగిన సభతో బీజేపీ-కాంగ్రెస్ బంధం బయటపడిందని, సీఎం రేవంత్రెడ్డి.. మోదీ ‘భాయీ భాయీ’ అయిపోయారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మణిపూర్లో రెండు తెగల మధ్య ఘర్షణ జరిగి అట్టుడికినా ప్రధాని ఒకసారి కూడా వెళ్లలేదని, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి.. ఒక్కసారిగా మోదీని ‘బడే భాయ్’ అనడం, తెలంగాణకు గుజరాత్ మాడల్ కావాలని అనడం అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి.
రామమందిర నిర్మాణం, ఊరూరా అక్షింతలు పంచడం వంటివి తమకు కలిసి వస్తాయని బీజేపీ భావించింది. తెలంగాణ ప్రజల్లో ఆ అంశాలపై పెద్దగా స్పందన కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉండేది. కానీ సాగునీటి నిర్వహణ, కరెంటు కోతలు, అవినీతి, కరువు వంటివి కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచాయని అంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీ కొత్త ఎత్తుగడలు వేశాయని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగడం, సీఎం రేవంత్రెడ్డి ‘తెలంగాణ ఆత్మగౌరవం’ నినాదం ఎత్తుకోవడం ‘గుజరాత్ అహంకారం.. తెలంగాణ పౌరుషం’ అంటూ ప్రచారం చేయడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ప్రచారం చేయడమూ ఓ పన్నాగమేనని, తద్వారా రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింల కోసం ఖర్చు చేస్తుందంటూ బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ నేతలు పెద్దగా మాట్లాడటం లేదని అంటున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ పైపై విమర్శలు, రొడ్డకొట్టుడు ఆరోపణలకే పరిమితమయ్యారని చెప్తున్నారు. ఇదే సమయంలో ‘మోదీ రాష్ర్టానికి గాడిద గుడ్డు’ ఇచ్చాడంటూ ప్రచారం చేస్తున్న రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలను పల్లెత్తు మాట కూడా అనడం లేదని గుర్తు చేస్తున్నారు.
అధికారంలో ఉన్నాం కాబట్టి లోక్సభ ఎన్నికల్లో తమకు ఎదురులేదని కాంగ్రెస్ అనుకోగా.. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిందని, దానిని తాము భర్తీ చేస్తామని బీజేపీ ఆశలు పెంచుకున్నాయి. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో పరిస్థితి తలకిందులైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నేరుగా ప్రజల మధ్యే ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. కేసీఆర్ తన యాత్ర మొత్తం ప్రజా సమస్యల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, రైతుబంధు రాకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడం, విద్యుత్తు సరఫరాలో ఆటంకాలు, కాలువలకు సాగునీటి విడుదలలో నిర్లక్ష్యం వంటి ప్రజా సమస్యలపైనే కేసీఆర్ ఫోకస్ చేశారు.
ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎలా దోఖా చేసిందో ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిన అన్యాయాలను సైతం ఎండగడుతున్నారు. మోదీ ఇచ్చే పెద్ద పెద్ద నినాదాలు అనుకోవడానికే తప్ప.. ఆచరణలో కనిపించడం లేదని ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా తాము కాంగ్రెస్కు ఓటేస్తే జరిగే నష్టం ఏమిటో మైనార్టీలు ఆలోచిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో డజనుకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ ముందువరుసలో నిలిచిందని అంంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కలిపి మళ్లీ కొత్త నాటకాలకు సిద్ధం అవుతున్నాయని అంటున్నారు.