చుంచుపల్లి, ఆగస్టు 10 : 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 538 మార్కులు సాధించి టేకులపల్లి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని సాగంటి హర్షితకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్-కొత్తగూడెం ఆధ్వర్యంలో చేయూత అందించారు. ఇంటర్మీడియట్ చదువు కొనసాగించేందుకు విద్యా సామగ్రి అవసరాల కోసం దాతల సహకారంతో రూ.25 వేల నగదును ఎన్ కె నగర్ లోని కమ్మ సత్రంలో అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాదానం గొప్పదని భావించి దాతలు స్పందించి సహాయం అందించడం అభినందనీయమన్నారు. సెక్రటరీ సురేష్ కుమార్ హర్షిత భవిష్యత్లో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ సభ్యులు హర్షితకు సరస్వతి దేవి ప్రతిమ, కాలేజీ బ్యాగ్, నోట్బుక్స్, పెన్నులు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, టేకులపల్లి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.