Punjab Assembly : పంజాబ్లో స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఫీజులు 5 శాతం మాత్రమే పెంచేందుకు అనుమతించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకోసం ‘ద పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (అమెండ్మెంట్) బిల్, 2026 నేడు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ స్కూల్స్, ఇతర విద్యా సంస్థలు ప్రతి ఏటా 5 శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదు.
ప్రస్తుతం పంజాబ్లోని విధాన సభ (అసెంబ్లీ) వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ సభలో ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి సంవత్సరం 5 శాతం మాత్రమే ఫీజులు పెంచాలి. దీనివల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఉపశమనం లభిస్తుందని సీఎం భగవంత్ మన్ అన్నారు. ఈ నిర్ణయం అన్ని రకాల ఫీజులకు కలిపి వర్తిస్తుంది. ట్యూషన్ ఫీజులు, డెవలప్మెంట్ ఫీజులు, యాన్యువల్ ఛార్జెస్, యాక్టివిటీ ఛార్జెస్, స్మార్ట్ క్లాసెస్, టెక్నాలజీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ల్యాబ్, లైబ్రరీ ఛార్జెస్, ఎగ్జామినేషన్ ఛార్జెస్ వంటివన్నీ కలిపి ఐదు శాతం మాత్రమే పెంచాలి. ఇతర ఫీజులేవైనా వసూలు చేసినా అవి కూడా ఐదు శాతానికి మించి పెంచకూడదు. ప్రస్తుతం పంజాబ్లో 7,800 వరకు ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి.
వీటిలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటి నుంచి విముక్తి కల్పించేలా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఒకవేళ అదనపు ఫీజులు వసూలు చేస్తే వాటిని తిరిగి, యాజమాన్యాల నుంచి వసూలు చేస్తారు. ఈ నిర్ణయం ప్రకారం మూడేళ్ల కాలానికి 15 శాతానికి మించి ఫీజుల పెంపుదల ఉండకూడదు.