న్యూఢిల్లీ: తొలి నుంచి మిత్ర దేశంగా.. విశ్వసనీయ మిత్రుడిగా ఉన్న సౌదీ అరేబియా ఎదురు తిరిగింది. అన్ని విధాలుగా అండగా ఉన్న భారత్కే షాకిచ్చింది. పెట్రోల్ ధరలను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆ పనేదో మీరే చేయండంటూ భారత్కు సవాల్ విసిరింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రెండు దఫాలు కేంద్రం విధించిన సుంకాలకు తోడు ప్రతిరోజూ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ధరలు పెంచడంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ లీటర్ ధర సెంచరీ మార్క్ దాటేసింది.
మరోవైపు అంతర్జాతీయంగా చమురు వినియోగం ప్రీ-కొవిడ్ నాటి స్థాయికి చేరుకోవడంతో సౌదీ అరేబియా సారధ్యంలోని ఓపెక్ దేశాలు గురువారం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఆమోదయోగ్యంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడంతోపాటు ఉత్పత్తిని తగ్గించాలంటూ భారత్ పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా తోసి రాజన్నది. కానీ ఉత్పత్తి తగ్గించే ప్రసక్తే లేదని సౌదీ తేల్చి చెప్పింది.
తమను ముడి చమురు ఉత్పత్తి తగ్గించమని చెప్పడానికి బదులు మీరు.. ప్రీ-కొవిడ్ నాటి స్థాయికి ధర తగ్గించి చౌకగా పెట్రోల్ పౌరులకు విక్రయించమని భారత్కు హితవు చెప్పింది సౌదీ అరేబియా. గురువారం ఒపెక్ సమావేశం సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ చమురు ధరలను స్థిరీకరించడానికి ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ సభ్యదేశాలను కోరారు. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న చమురు ధరలు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని, డిమాండ్ను దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్లా అజీజ్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ భారత్ గతేడాది అతి చౌక ధరకే లభించిన కొంత ముడి చమురు నిల్వ చేసుకోవాల్సిందన్నారు. గతేడాది ఏప్రిల్-మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసి విశాఖపట్నం, మంగళూరు, పదూర్ల్లోని రిజర్వుల్లో నిల్వ చేసింది. అప్పట్లో ముడి చమురు ధర బ్యారెల్పై 19 డాలర్లుగా ఉంది.
ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సమయంలో కేంద్ర ముడి చమురు సంస్థలు 2017, 2018ల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. కానీ కొన్ని వారాల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. టాక్స్లతోపాటు ప్రీ-కొవిడ్కు ముందు ధరలతో పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.100 దాటేసింది. తాజాగా ప్రతి రోజూ కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తుండటం గమనార్హం.