Crypto Currency | బిట్ కాయిన్.. ఎథీరియం..డోజ్కాయిన్..ఇవన్నీ క్రిప్టో కరెన్సీ రూపాలు. ప్రస్తుతం వీటికి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది. కానీ వీటి నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో మాత్రం లేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వీటిని వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో బిట్ కాయిన్ స్కాం కూడా వెలుగు చూసింది. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీల కట్టడికి పూనుకున్నది. ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నది. ఆ బిల్లు చట్టంగా మారితే క్రిప్టో కరెన్సీల నిర్వహణ మదుపర్లు.. వాటి ఎక్స్చేంజ్ల ప్లాట్ఫామ్లకు కష్టతరంగా మారనున్నది. ఒకవేళ మదుపరి గానీ, ఏదేనీ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ గానీ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారంట్ లేకుండా వారిని అరెస్ట్ చేయొచ్చు. నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అందుబాటులోకి రాలేదు.
పొరుగుదేశం చైనా గత సెప్టెంబర్ నుంచే క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ మరింత వేగవంతం చేసింది. ఇటీవలే దేశీయంగా బిట్ కాయిన్ స్కామ్ వెలుగు చూశాక.. పలు క్రిప్టో కరెన్సీ కాయిన్లను నిషేధించడానికి మోదీ సర్కార్ కసరత్తు చేస్తున్నది. కేంద్రం రూపొందించిన బిల్లు ప్రకారం క్రిప్టో కరెన్సీని వ్యక్తులు మైనింగ్ చేయడం, ఉత్పత్తి చేసి తమ వద్ద అట్టిపెట్టుకోవడం, క్రయ విక్రయాలు సాగించడం వంటి అన్ని రకాల కార్యకలాపాలపై సాధారణ నిషేధం అమల్లోకి వస్తుంది.
అయితే, క్రిప్టో కరెన్సీలకు మూలమైన బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తామని కేంద్రం ఇంతకుముందు ప్రకటించింది. కానీ ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే సాధారణ మదుపర్లకు కూడా కష్టకాలమే కానున్నదని న్యాయవాదులు చెబుతున్నారు. చెల్లింపులను అనుమతించకుండా, ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లింపులకు కూడా మినహాయింపులివ్వకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధిని సమర్థవంతంగా నిలిపేయడమేనని ఇకిగాయి లా సంస్థ ఫౌండర్ అనిరుధ్ రస్తోగీ చెప్పారు.
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్పై కొరడా ఝుళిపించేందుకు కేంద్ర ప్రణాళికలు రూపొందిస్తున్నదన్న వార్తలు మార్కెట్లో హల్చల్కు దారి తీసింది. పలువురు ఇన్వెస్టర్లు గణనీయంగా నష్టపోయారు. ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలు అడ్వర్టైజ్మెంట్లు జారీ చేయకుండా కూడా సదరు చట్టంలో నిబంధనలు చేర్చనున్నారని తెలుస్తున్నది. కేంద్రం వద్ద అధికారిక సమాచారం లేకున్నా.. పారిశ్రామిక వర్గాల కథనం ప్రకారం కోటి నుంచి రెండు కోట్ల మంది ఇన్వెస్టర్లు దేశంలో క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టారని తెలుస్తున్నది. సుమారు రూ.45 వేల కోట్ల (6 బిలియన్ల డాలర్లు) మేరకు పెట్టుబడులు పెట్టారని సమాచారం.
ఎక్స్చేంజ్లతో సంబంధం లేకుండా ఇన్వెస్టర్లు సెల్ఫ్ వాలెట్ల నిర్వహించుకోవడంపైనా నిషేధం అమల్లోకి రానున్నది. క్రిప్టో కరెన్సీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని తొలి నుంచి ఆర్బీఐ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రిప్టో కరెన్సీల నియంత్రణ సంస్థగా సెబీని నియమించనున్నట్లు వార్తలొచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!