Personal Finance Tips | బుల్ పరుగు అందుకుందంటే కొందరి కండ్లు జిగేల్మంటాయి. బేర్ రెచ్చిపోయిందా బోరుమనేవారు ఎందరో! సెన్సెక్స్ సూచీలు పతాక స్థాయికి చేరగానే వెలిగిపోయే ముఖాలు కొన్నయితే, మార్కెట్ పతనంతో కుదేలయ్యేవాళ్లు ఇంకొందరు. కానీ, షేర్ బజార్ జోరు మీదున్నప్పుడు తప్పులో కాలేస్తే ముప్పు తప్పదు. దలాల్ స్ట్రీట్ ఈక్వేషన్లు మహాభారతంలోని శకుని పాచికల కన్నా ప్రమాదకరమైనవి! మాయా శశిరేఖలా కనికట్టు చేస్తే గానీ, ఇక్కడ లాభాలు ఒడిసిపట్టలేం! కాలంతో కలబడితే గానీ నిలబడలేం!!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఊపు మీదుంది. ఆల్టైమ్ హయ్యెస్ట్ మార్క్ను అందుకున్న వార్తలు మదుపరులను విచిత్ర పరిస్థితిలోకి నెడుతాయి. మార్కెట్ ఉరుకులమీద ఉందని తెలియగానే పరుగు ఆపడమే మేలని కొందరు భావిస్తారు. చేతిలో ఉన్న స్టాక్స్ను చకచకా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే అనేది కొందరి పట్టుదల! స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సాధారణంగా చోటుచేసుకునేవే! సూచీల స్థాయిలతో పేచీ పడకుండా మనం ఎందుకు ఇన్వెస్ట్ చేశామో, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ, మార్కెట్ స్థితిగతులకు లోబడి నిర్ణయాలు తీసుకుంటే పూర్తిస్థాయి ప్రయోజనం పొందలేరు.
సెన్సెక్ సూచీలు గరిష్ఠ మార్కును అందుకున్నాయని తరచూ వింటుంటాం. ఉదాహరణకు కొద్దిరోజుల కిందట 66 వేల మార్కును దాటి రికార్డు నెలకొల్పింది. మరో వారానికి ఇది తెరమరుగు కావొచ్చు. కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని మనం తొందరపడాల్సిన పనిలేదు. బేర్ విజృంభణ మొదలైందని బెంబేలెత్తిపోయి అగపడి చేతులు కాల్చుకోవద్దు. మార్కెట్ హైలో ఉందన్నంత మాత్రాన అన్ని స్టాక్లూ అదే రేంజ్లో ఉన్నట్టు కాదు. ర్యాలీ సాదాసీదాగా సాగితే ఊగిసలాడొద్దు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇదంతా చేస్తారు కదా! ఆ అవసరం రాకముందే మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతున్నదనీ, మునుపెన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరిందని పెట్టుబడి ఉపసంహరించుకోవడం తెలివైన పని కాదు. సూచీల పాయింట్లు ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటాయి. సూచీలు నేల చూపులు చూసినంత మాత్రాన అన్ని స్టాక్స్ పడిపోయినట్టు కాదు. అలాగని దిగువకు పడిపోయిన షేర్ ధరలు అక్కడే తిష్ఠవేసి కూర్చుంటాయనీ అనుకోవద్దు. మీ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడి ఉపసంహరించుకోవాలే కానీ, బుల్ రంకెలేస్తుందనో, బేర్ కాచుకుందనో మాత్రం కాదు!
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు టైమింగ్ను నమ్ముకోవద్దు. ఎంత కాలం ఉందన్న దాన్నిబట్టి విలువ పెరుగుతుంది. కరోనా మార్కెట్ను కుదిపేసినా మళ్లీ పుంజుకుంది. మన దేశంలో ప్రభుత్వం మారినప్పుడు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడు కూడా మార్కెట్ ప్రభావితమవుతుంది. అంతమాత్రానికే ఏదో చేటు కలగబోతున్నదని ఊహించుకొని అమ్మకాలకు సిద్ధపడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. అవసరం లేనప్పుడు పెట్టుబడి ఉపసంహరించడం అంటే ఆకలి లేనప్పుడు అన్నం తినడం లాంటిదే! తీరా ఆకలి వేసినప్పుడు తినడానికి ఏమీ లేకుండా పోతుంది. సహజంగా ప్రతి పెట్టుబడికీ ఓ లక్ష్యం ఉంటుంది. కూతురు పై చదువులకో, కొడుకు సెటిల్మెంట్కో, సొంతింటికి పెట్టుబడి కోసమో ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం! ఆయా అవసరాలు రాకముందే మార్కెట్ ప్రకంపనలకు భయపడి, ఇంతటి లాభాలు మున్ముందు రావేమోనని అనుమానించి పెట్టుబడులు ఉపసంహరించొద్దు. కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు షేర్లను హోల్డ్ చేయడమూ మంచిదే! మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆరు నెలల ముందునుంచి మార్కెట్ స్థితిగతులు పరిశీలించి మంచి సమయం చూసి లాభాలు స్వీకరిస్తే.. మీ నిరీక్షణ విజయవంతం అవుతుంది.
2009లో సెన్సెక్స్ 9వేలు 10వేల పాయింట్ల మధ్య కొనసాగింది. 14 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం 64 వేల నుంచి 65 వేల మధ్య ట్రేడ్ అవుతున్నది. ఈ లెక్కన ఏడాదికి సగటున 15 శాతం వృద్ధి నమోదైంది. కనీసం 12 శాతం వృద్ధిగా లెక్కగట్టినా మరో ఐదేండ్ల తర్వాత సెన్సెక్స్ లక్ష మార్కు దాటి సెన్సేషన్ సృష్టిస్తుంది. మరో ముఖ్యమైన విషయం బంగారం ధర పెరుగుతుంటే ఇంకా పెరగవచ్చని కొనుగోలుకు మొగ్గుచూపుతారు. పసిడి ధర పడిపోతుంటే ఇలాంటి అవకాశం మళ్లీ రాదని కొంటారు. ఇదే కాన్సెప్ట్ మార్కెట్కు కూడా అమలుపరిస్తే ఆర్థిక విజయం మీ సొంతం అవుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల కన్నా మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం!
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Home Loan | హోంలోన్ తీసుకున్న వారికి అలర్ట్.. వడ్డీరేటు పెరిగినప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించండి
“Commercial Property | ఇల్లు కొంటే మంచిదా? కమర్షియల్ ప్రాపర్టీ కొంటే లాభమా?”