ఒకేరోజు 1.20 లక్షల బస్తాల రాక
మార్కెట్ చరిత్రలో తొలిసారి
నేటి నుంచి మూడు రోజులు సెలవులు
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్కు చరిత్రలో తొలిసారిగా బుధవారం 1.20 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. మార్కెట్కు మన జిల్లాతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఏపీలోని పలు జిల్లాల నుంచి భారీగా సరుకు తరలివచ్చింది. పొరుగు జిల్లాల్లో మిర్చి క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఖమ్మం ఏఎంసీపై పడింది. మంగళవారం అర్ధరాత్రే 50 వేల బస్తాలు మార్కెట్కు రాగా జెండా పాట సమయానికి రూ.1.20 లక్షలకు చేరుకున్నది. అప్రమత్తమైన ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, సెక్రటరి ఆర్.మల్లేశం జెండా పాటను పర్యవేక్షించారు. పంట భారీగా రావడంతో మిర్చి యార్డుతో పాటు పత్తి యార్డులో దిగుమతికి అనుమతి ఇచ్చారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు మార్కెట్కు సెలవులు ఉంటాయని ఏఎంసీ చైర్మన్ మద్దినేని తెలిపారు.
గరిష్ఠ ధర రూ.14,300..
గరిష్ఠ ధర క్వింటాకు రూ.14,300 ధర పలుకగా కనిష్ఠ ధర రూ 9 వేలు పలికింది. మధ్య ధర రూ.11,500 చొప్పున ఖరీదుదారులు పంట కొనుగోలు చేశారు. తాలు రకం పంటకు రూ.7,200 ధర లభించింది. ఒకేరోజు ఊహించని విధంగా పంట రావడంతో చైర్మన్ మద్దినేని దిగుమతిశాఖ వ్యాపారులతో సమీక్ష నిర్వహిచారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 ప్రభావం కొనసాగుతున్నప్పటికీ రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది ఇదే సీజన్లో మార్కెట్ మూతపడిందని, సరుకు దాచిపెట్టుకునేందుకు రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. ఎగుమతులకు మంచి అవకాశం ఉండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి కోలాహలం నాగరాజు, గ్రేడ్-టు అధికారి బజార్, అసిస్టెంట్ కార్యదర్శులు నిర్మల, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.