Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పటికే సంబంధిత విషయంపై ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ‘దయచేసి వారంలో కనీసం 3 రోజులైనా ఆఫీసులకు రండి. అతి త్వరలోనే ఇది తప్పనిసరి కానుంది’ అని ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో ఇన్ఫీ పేర్కొంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, విప్రో వంటి టాప్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇన్ఫోసిస్ కూడా ఇటీవలే తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది.
మిడ్ లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగులు నెలలో 10 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. ‘రిటర్న్ టు ఆఫీస్ విధానం, హైబ్రిడ్ వర్క్ మోడల్ను బలోపేతం చేసే దిశగా.. ఉద్యోగుల్ని నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. 2023, నవంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఇన్ఫీ వైస్ప్రెసిడెంట్స్ నుంచి ఉద్యోగులకు మెయిల్ ద్వారా గతంలో సమాచారం అందింది. అయితే, ఇప్పుడు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీసుకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read..
Shah Rukh Khan | డంకీ రిలీజ్కు ముందు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన షారుఖ్.. ఏడాదిలో మూడోసారి
Pakistan | పాకిస్థాన్ ఆర్మీబేస్పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
Mahua Moitra | మహువా 30 రోజుల్లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలి : పార్లమెంట్ హౌసింగ్ కమిటీ