Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే (expulsion as MP). ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని మహువాను పార్లమెంట్ హౌసింగ్ కమిటీ (Housing Committee of Parliament) ఆదేశించింది. ఈ మేరకు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs) కు హౌసింగ్ కమిటీ లేఖ రాసింది. 30 రోజుల్లోగా మహువా తన బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాలని మంత్రిత్వ శాఖను కోరింది.
మరోవైపు తన బహిష్కరణపై మహువా సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తనను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ హమువా మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని దర్శన్ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఉపయోగించానని అక్టోబర్ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు.
Also Read..
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు
Omar Abdullah | ఆ విడాకులకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరణ.. ఒమర్ అబ్దుల్లా పిటిషన్ కొట్టివేత
Rajasthan CM | నేడు రాజస్థాన్ సీఎంను ఎంపిక చేయనున్న బీజేపీ..