న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (NC) అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. తన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఒమర్ అబ్దుల్లా డైవోర్స్ పిటిషన్ను కొట్టివేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్పై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని, కాబట్టి విడాకులు మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.
‘ఒమర్ అబ్దుల్లా తన భార్య క్రూరంగా వ్యవహరిస్తున్నదంటూ విడాకుల కోసం పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్లో ఆమె క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. చేసిన ఆరోపణలకు కూడా పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన వేసిన అప్పీల్ పిటిషన్లో కూడా ఎలాంటి మెరిట్స్ లేవు. కాబట్టి ఈ అప్పీల్ను డిస్మిస్ చేస్తున్నాం’ అని జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం తీర్పుచెప్పింది.
కాగా ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా గొడవల కారణంగా ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒమర్ అబ్దుల్లా తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. అయితే పాయల్ అబ్దుల్లా.. రాజస్థాన్ కాంగ్రెస్ అగ్ర నేత సచిన్ పైలట్ సోదరి కావడం గమనార్హం.