న్యూఢిల్లీ : కరోనా కట్టడికి పలు రాష్ట్రాల్లో కఠిన లాక్ డౌన్ నియంత్రణలు అమల్లో ఉన్నా మే నెలలో స్ధూల జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదవ నెలలోనూ రూ లక్ష కోట్లు దాటాయి. మేలో రూ 1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెల వసూళ్లతో పోలిస్తే ఇవి 28 శాతం పడిపోగా, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 65 శాతం అధికం.
ఇక జీఎస్టీ వసూళ్లలో రూ 17,592 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ 22,653 కోట్లు ఎస్ జీఎస్టీ వసూళ్లని, రూ 53,199 కోట్లు ఉమ్మడి జీఎస్టీ కింద వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెస్ కింద మే నెలలో రూ 9,265 కోట్లు వసూలయ్యాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడంతో ఆర్థిక కార్యకలాపాలపై లాక్ డౌన్ ల ప్రభావం తము అంచనాల కంటే తక్కువగానే ఉందని వెల్లడైందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు.