జైపూర్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 24 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. గురువారం రాష్ట్ర కేబినెట్ వర్చువల్ విధానంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో లాక్డౌన్పై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్కు వచ్చే ఏ వ్యక్తయినా 72 గంటలకు మించకుండా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ చూపాల్సిందేనని స్పష్టం చేసింది. వసల కార్మికులు సొంత ప్రాంతాలకు తిరిగి రాకుండా నిరోధించేందుకు అన్ని పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది.
సంబంధిత దుకాణాలు తెరిచే ఉంటాయని చెప్పింది. రాజస్థాన్లో మే 10 ఉదయం 5 నుంచి మే 24 ఉదయం 5 గంటల వరకు కఠినమైన లాక్డౌన్ అమలులో ఉంటుందని, ఈ నెల 31 వరకు వివాహ వేడుకలపై నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే అన్ని మతపరమైన ప్రదేశలు మూసివేస్తున్నట్లు తెలిపింది. వివాహ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇవ్వరని, రాష్ట్ర, అంతర్రాష్ట్రల మధ్య ట్రాన్స్పోర్టులు కొనసాగుతాయని చెప్పింది. ఇంట్లో రిజిష్టర్ మ్యారేజ్లు 11 మందికి మించకుండా పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది.
డీజే, సౌండ్ సిస్టమ్, క్యాటరింగ్ సర్వీసులపై నిషేధం విధించింది. ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, టెంట్ సర్వీస్ ప్రొవైడర్లు లాక్డౌన్ ఉన్న సమయంలో ఉన్న వివాహాలకు సంబంధించి వినియోగదారులు చెల్లించిన అడ్వాన్స్ను తిరిగి చెల్లించాలని, లేదంటే తర్వాత తేదీల్లో జరుపుకునేందుకు ఇద్దరూ ఒప్పందం చేసుకోవచ్చని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కార్మికులు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించినందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉపాధిహామీ పనులు నిలిపివేయాలని సూచించింది. ఆర్టీపీసీఆర్ నివేదిక ఇవ్వని వారంతా 15 రోజులు ఐసోలేషన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.