హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.350.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్జించిన రూ.313.6 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 11.83 శాతం అధికం. అన్ని మార్కెట్లలో అమ్మకాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం రూ.884.2 కోట్లుగా ఉన్న ఆదాయం.. గత త్రైమాసికానికి రూ.1,153.90 కోట్లకు ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో శ్రీనివాస్ సాదు మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమైన ఔషధాల సరఫరా చేయడంలో విఫలం కాలేదన్నారు.