Elon Musk | ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీ (ChatGPT ) టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నవంబర్లో చాట్జీపీటీ లాంఛ్ కాగా రోజురోజుకూ దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రశ్నలకు, సమస్యలకు ఏఐ చాట్బాట్ (AI Chatbot) చిటికెలో పరిష్కారాలను, సమాధానాలను ఇస్తూ యూజర్ల నుంచి మంచి స్పందనను రాబడుతోంది.
ప్రస్తుతం చాట్ జీపీటీ దెబ్బ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలపై పడింది. ఒకదాని వెనక ఒకటి.. కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ టూల్ తీసుకొచ్చే పనిలో గూగుల్ (Google) మాతృ సంస్థ అల్ఫాబెట్ నిమగ్నం కాగా, ఇప్పుడు బిలియనీర్, ట్విట్టర్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ( Elon Musk ) కూడా దృష్టి సారించారు. ఈ మేరకు చాట్జీపీటీకి పోటీగా కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ‘‘ట్రూత్జీపీటీ’ (TruthGPT) పేరుతో ఏఐ చాట్బాట్ (OpenAI Chatbot)ను తీసుకురాబోతున్నా. ఇది ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుంది. ఇది మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉండదని నేను భావిస్తున్నా’ అని మస్క్ తెలిపారు.
కాగా, కృత్రిమ మేధతో మానవాళికి ముప్పు పొంచి ఉందని మస్క్ హెచ్చరిస్తూ వస్తున్నారు. నాగరిక సమాజ భవిష్యత్తుకు ఉన్న అతిపెద్ద ప్రమాదాల్లో ఏఐ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఏఐ భద్రతను నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)తో ముప్పు తప్పదని అన్నారు. ఆ ముప్పు నుంచి తప్పుకోవాలంటే కృత్రిమ మేధ టెక్నాలజీపై నియంత్రణ ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. కనుక కృత్రిమ మేధను అందరికీ ప్రయోజనకరమైన మార్గంలో వినియోగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాలని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
Also Read..
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు