న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని మంగళవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాలు తెలిపాయి. 2020 జూలైలో 8 ప్రధాన మౌలిక రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి 7.6 శాతం క్షీణించింది. 2021 జూలై నెలలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ విభాగాలు 18.7 శాతం, 18.9 శాతం, 6.7 శాతం, 9.3 శాతం, 21.8 శాతం, 9 శాతం చొప్పున వృద్ధిచెందాయి. ముడి చమురు ఉత్పత్తి మాత్రం 3.2 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.5 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 8 మౌలిక రంగాలు 21.2 శాతం వృద్ధిచెందాయి. గతేడాది ఇదేకాలంలో ఇవి 19.8 శాతం ప్రతికూల వృద్ధిని చవిచూసాయి.