Heeramandi | హీరామండీ- ద డైమండ్ బజార్
నెట్ఫ్లిక్స్: మే 1
తారాగణం: మనీషా కొయిరాలా, అదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా తదితరులు
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో నిష్ణాతుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన మొదటిసారి నిర్మించిన వెబ్సిరీస్ ‘హీరామండీ’ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నది. నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ టాప్ 10లో దూసుకుపోతున్నది. హిందీతోపాటు కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నది. స్వాతంత్య్రానికి ముందు లాహోర్లోని హీరామండి (వేశ్యావాటిక)లో జరిగిన పలు సంఘటనల ప్రకారం ఈ సిరీస్ నిర్మించారు. ఇక కథలోకి వెళ్తే… హీరామండీలో ఉన్న షాహీ మహల్కు మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) పెద్ద దిక్కు. బిబోజాన్ (అదితిరావు హైదరీ), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఆమె కూతుళ్లు, వహీదా (సంజీదా షేక్) సోదరి.
అదే ప్రాంతంలోని ఖ్వాభాగ్ మహల్కు పెద్ద ఫరీదాన్ (సోనాక్షి సిన్హా). కొన్ని సంఘటనల కారణంగా మల్లికా జాన్, ఫరీదాన్ మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. బ్రిటిష్వాళ్లతో సత్సంబంధాలు కలిగి ఉన్న వలీసాహెబ్ (ఫర్దీన్ఖాన్)తో పరిచయం పెంచుకుంటుంది బిబోజాన్. స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా పనిచేసే బిబోజాన్.. వలీసాహెబ్ దగ్గరనుంచి రహస్యాలను తెలుసుకుంటూ ఉంటుంది. ఆమె గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటిష్వాళ్లు బిబోజాన్ను ఏం చేశారు? షాహీ మహల్ చేజిక్కించుకోవడానికి ఫరీదాన్ ఎలాంటి కుట్రలు చేసింది? వాటిని మల్లికా జాన్ ఎలా ఎదుర్కొన్నది? తదితర విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎనిమిది ఎపిసోడ్లుగా నిర్మించిన ఈ వెబ్సిరీస్ వారాంతంలో చూసేందుకు మంచి ఆప్షన్.