Ashok Vaswani | ముంబై, మే 4: రిజర్వు బ్యాంక్ నియంత్రణ విధించడంతో క్రెడిట్ కార్డు వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వాస్వాని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్ మొత్తం వ్యాపారంపై స్వల్పంగా ప్రభావం చూపనున్నప్పటికీ, కానీ, పరువు నష్టానికి సంబంధించిన అంశమన్నారు. గత కొన్ని నెలలుగా పరిమితులు విధించుకుంటూ వస్తున్నామని, అయినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ గట్టి షాకిచ్చిందని చెప్పారు.
ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నూతన ఖాతాదారులు చేర్చుకోవద్దని రిజర్వు బ్యాంక్ గత నెలలో నియంత్రించిన విషయం తెలిసిందే. అలాగే కొత్తగా క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయకూడదని ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ చర్యలతో క్రెడిట్ కార్డు వ్యాపారం, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. టెక్నాలజీ సమస్యలను పరిష్కరించడానికి గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,700 కోట్ల నిధులు వెచ్చించినట్లు, అంతక్రితం ఏడాది కేటాయించిన రూ.1,300 కోట్ల కంటే ఇది 25 శాతం అధికమని పేర్కొన్నారు.
క్యూ4లో 4,133 కోట్ల లాభం
గతేడాది చివరి త్రైమాసికానికిగాను రూ.4,133 కోట్ల నికర లాభాన్ని గడించింది కొటక్ మహీంద్రా బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,496 కోట్ల కంటే ఇది 18 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.15,285 కోట్లకు ఎగబాకింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.39 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.34 శాతానికి దిగింది. మరోవైపు రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2 డివిడెండ్ను ప్రకటించింది.