పేదరికంలో పుట్టి.. పుట్టెడు కష్టాల్లో పెరిగాడు. ఆకలిని జయించాలన్న కసితో చదివాడు. అప్పులు చేసి అమెరికా చేరాడు. ఎన్నో డిగ్రీలు పూర్తిచేశాడు. పెద్ద పెద్ద కొలువుల్లో రాణించాడు. పేరే కాదు.. పది తరాలకు సరిపడా డబ్బూ సంపాదించాడు. కానీ, ఒక్క తరానికి కూడా ఆ డబ్బు ఇవ్వను అంటున్నాడు తామరిస కందాళ గోపాలకృష్ణ. ‘ముగ్గురు కొడుకుల్ని పెంచాను. చదివించాను. ప్రయోజకుల్ని చేశాను. నా బిడ్డల్లాంటి లక్షల మంది పిల్లలు తల్లిదండ్రుల అండలేక చదువుల్లో వెనుకబడుతున్నారు. వాళ్ల కోసమే నా సంపద అంకితం చేస్తా’ అంటున్నారు గుణ సంపన్నుడైన టి.కె. గోపాలకృష్ణ.
మాది నిరుపేద కుటుంబం. నాన్న శ్రీనివాసాచార్యులు అబిడ్స్లోని మెథడిస్ట్ బాయ్స్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అందువల్ల ఆ స్కూల్లో మాకు చదువు ఉచితం. నారాయణగూడలో రెండు గదుల ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. నాకు ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. ఆరుగురం ఒక గదిలో చాపపై పడుకునేవాళ్లం. నాన్న నెల జీతం 270 రూపాయలు. 20వ తారీఖు వచ్చే సరికి నాన్న చేతిలో డబ్బులు ఉండవు. ఆ పది రోజులు అమ్మ చాలా పొదుపుగా ఇల్లు నడిపేది. మార్కెట్లో చవకగా అమ్మే బొప్పాయి కొనేది. మునగ చెట్లు ఉన్నవాళ్లు ఆకులు ఊరికనే ఇచ్చేది. నాలుగైదు టమాటాలతో చారు కాచేది. నారాయణగూడ నుంచి అబిడ్స్కి రోజూ నడిచిపోయేవాళ్లం. కాలికి చెప్పులు ఉండేవి కావు. అదేమి చిత్రమో! ఎండలు మండుతున్నాయని ఒంటిపూట బడులుపెట్టేవారు. మిట్టమధ్యాహ్నం ఎండల్లో ఇంటికిపొమ్మని వదిలిపెట్టేవాళ్లు. ఇంటికి నడిచిపోతుంటే కాళ్లు కాలేవి. పేదరికం వల్ల అనుభవించిన బాధలు మిగతావాళ్లలా బతకాలనే కోరిక పెంచాయి. నాలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది.
పదో తరగతి చదువుతున్నప్పుడు నాన్న రిటైర్ అయ్యారు. అప్పటినుంచి ఇంటి దగ్గర ట్యూషన్లు మొదలుపెట్టారు. ఇంజినీరింగ్ చదువుతానంటే ఫీజులు కట్టలేను. నీకు నువ్వే సంపాదించుకోవాలని నాన్న అన్నారు. అప్పట్లో ఇంజినీరింగ్ అయిదేళ్ల డిగ్రీ. ఒక్కో సెమిస్టర్కి 90 రూపాయలు ట్యూషన్ ఫీజు. అప్పట్లో నెలకు వంద రూపాయల నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కోసం 25 మందిని ఎంపిక చేసేవాళ్లు. నా ర్యాంక్ 14. కాబట్టి తప్పకుండా స్కాలర్షిప్ వస్తుందని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్లో చేరాను.
రెండు నెలలు గడిచింది. ఆ రెండు నెలల స్కాలర్షిప్ ఒకేసారి వచ్చింది. నాన్న ఆదాయం కంటే నా స్కాలర్షిప్ ఎక్కువ! ఆ రోజే వాచీ, చెప్పులు కొన్నాను. అప్పటి దాకా చెప్పులు లేకుండానే కాలేజీకి వెళ్లాను. నేను 6వ తరగతి చదివేప్పుడు మా పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు పోయారు. నన్ను ఆ విహార యాత్రకు అనుమతించలేదు. ఆ విహారయాత్రకు పోయినవాళ్లు రంగు రంగుల కరెంటు బల్బుల తయారీ గురించి చెబుతుంటే నేను బాధపడ్డాను. అప్పుడు.. ‘సార్.. నేనేం తప్పు చేశానని నన్ను తీసుకుపోలేద’ని మా టీచర్ని అడిగాను. ‘అది గ్లాస్ ఫ్యాక్టరీ. నీకు చెప్పుల్లేవు. చెప్పుల్లేని వాళ్లను ఫ్యాక్టరీ వాళ్లు లోనికి రానివ్వరు’ అని చెప్పారాయన. పదకొండేళ్లప్పుడు నా మనసుకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. మండే ఎండల్లో బడి నుంచి ఇంటికి పోయిన బాధ కంటే ఎక్కువ బాధపడ్డాను. ఇంజినీరింగ్ చదివేనాటికి చెప్పులు తొడగాలనే కోరిక తీరింది.
ఇంజినీరింగ్లో భవిష్యత్ గురించి ఏమీ తెలియదు. ఎక్కువమంది సివిల్ ఇంజినీరింగ్ వైపు ఆసక్తి చూపేవాళ్లు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో సబ్జెక్టులు ఎంచుకోవాలి. అయితే, నాకు ఏం చదవాలో అవగాహన లేదు. అందుకే, నాన్నతో రెండు దరఖాస్తులపై సంతకాలు పెట్టించుకొని, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని కాలేజీకి బయలుదేరాను. అప్పట్లో కొంతమంది ప్రొఫెసర్లు విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించేవారు. వాళ్లలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రొఫెసర్ వై. నరసింహన్ గారు ఒకరు. ఆయనే జీవితంలో గొప్పగా ఎదగాలనే ఆశ పుట్టించారు. ఆయన్ని కలిసి.. ‘సార్ దేంట్లో చేరమంటారు?’ అని అడిగాను. నా చేతిలోని దరఖాస్తులు చూసి.. ‘నువ్వు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేరు’ అన్నారు. ఆయన చెప్పినట్టే చేశాను. 1968లో బ్యాచ్లర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తయ్యింది.
ఇంజినీరింగ్లో మాస్టర్స్కు ఐఐటీ ఖరగ్పూర్కి దరఖాస్తు చేశాను. స్పాట్ అడ్మిషన్లో సీటు వచ్చిందని టెలిగ్రాం వచ్చింది. ఎవరో చేరలేదు కాబట్టి వాళ్ల సీటు నాకు వచ్చింది. ఎవరో వదలుకుంది నాకెందుకని నేను చేరదలుచుకోలేదు. భిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. అది పట్టణానికి దూరంగా ఉంటుందని చేరాలనిపించలేదు. ఆరు నెలలు ఖాళీగా ఉన్నాను. అమెరికాలో చదవాలనుకున్నాను. అక్కడ తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అక్కడ ఏమీ తెలియదు. ఎందుకు పోవాలనుకున్నానో తెలియదు. మా స్నేహితుల తల్లిదండ్రులు పదిమంది దగ్గర ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయల చొప్పున అప్పు అడిగాను. ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పు తీరుస్తానని వాళ్లకు మాటిచ్చాను. అలా వాళ్ల సాయంతో అమెరికా పోయాను. లారెన్స్లోని కన్సాస్ యూనివర్సిటీలో చేరాను. సగం డబ్బులు ట్యూషన్ ఫీజు కట్టాను. మిగతా సగంతో అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాను. రెండో ఏడాది నుంచి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించాను. ఎమ్మెస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయిపోయింది. అక్కడే ఉద్యోగంలో చేరాను. మధ్య మధ్యలో ఉద్యోగాలకు సెలవు పెడుతూ ఎమ్మెస్ సివిల్ ఇంజినీరింగ్, ఎంబీఏ చదివాను. ఎంబీఏ, ఎమ్మెస్లో 95 శాతం మార్కులు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్ పీహెచ్డీ చేయమని ప్రోత్సహించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి 1974లో దరఖాస్తు చేశాను. అది ప్రపంచంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్. అందులో సీటు రావడం చాలా కష్టం. నాకు అక్కడ చదివే అవకాశం వచ్చింది. మొదటి సెమిస్టర్కు ఫీజు కట్టు. తర్వాత ఫ్రొఫెసర్లు రికమండ్ చేస్తే ఫ్రీగా చెబుతామన్నారు. వెయ్యి డాలర్లు కట్టే స్తోమత లేక గొప్ప అవకాశాన్ని వదులుకున్నాను. ఆ స్కూల్లో పీహెచ్డీ పూర్తి చేసి ఉంటే పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యే వాడినేమో!
ప్రేమించి (కేరళ అమ్మాయిని) పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగం, సంసార జీవితంలోకి అడుగుపెట్టినా చదువు మీద ఆసక్తి తగ్గలేదు. శానిటరీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ చదివాను. నాలుగో డిగ్రీ సంపాదించాను. అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేశాను. అప్పట్లో నాకున్న ఒకే ఒక డ్రీమ్.. కుటుంబానికి సహాయపడుతూ అమ్మానాన్మలను బాగా చూసుకోవడం. రెండో ఏడాది నుంచి ఇంటికి నెలనెలా వంద డాలర్లు పంపాను. మేం నలుగురం అన్నదమ్ములం. మాలో ముగ్గురు ఇంజినీర్లు. ఒకరు డాక్టర్ అయ్యాం. నేను వ్యాపారాలు చేస్తున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. జీవితంలో ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగాయి.
మా పిల్లలు రేపు అప్పులు చేయకుండా బతకాలని నేను అప్పులు చేశాను. ముగ్గురినీ బాగా చదివించాను. ముగ్గురూ బాగా సెటిల్ అయ్యారు. పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం.. నేను, మా ఆవిడ కలిసి ముగ్గురి ఇళ్లకు పోయాం. ‘మా సంపాదన నుంచి మీ చేతికి డబ్బు రాదు. మేం చనిపోతే మా ఆస్తి కూడా మీకు రాదు. మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా?’ అనడిగాను. ‘నాన్నా మీరు మమ్మల్ని బాగా చదివించారు. మంచిగా పెంచారు. మేం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇంతకంటే మీ నుంచి ఇంకేమీ వద్దు’ అన్నారు. ‘సరే.. నా ఆస్తిని, ఆదాయాన్ని పేద పిల్లల చదువు కోసం ఖర్చు చేద్దామనుకుంటున్నా’నని వాళ్లతో చెప్పాను. ‘మీ ఆస్తి, మీ సంపాదన, మీ ఇష్టం నాన్నా’ అన్నారు. వాళ్ల పిల్లల్ని వాళ్లే పెంచుకోవాలి. వాళ్లే సంపాదించుకోవాలి. అన్నీ నేనే ఇస్తే వాళ్లు ఉద్యోగాలు చేయరు. అందుకే వాళ్లకు చదువు మాత్రమే ఇచ్చాను. ఆస్తులు ఇవ్వలేదు. ఇల్లు కూడా ఇవ్వలేదు.
నా సంపాదన సమాజానికి ఉపయోగపడటం కోసం నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అయిదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాను. ఈ డబ్బును ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం కోసం నూతన భవన నిర్మాణానికి ఖర్చు చేయాలని సూచించాను. ఆ పనులు మొదలుపెట్టారు. ఇక్కడ చదివే పేదలకు నూతన భవనంలో ఆధునిక సదుపాయాలు కల్పించేలా నిర్మిస్తారు. చిన్నప్పుడు పేదరికం శాపం అనుకునేవాడిని. కానీ, నాకు అదో వరం అనిపిస్తున్నది. పేదవాడిగా పుట్టకపోతే ప్రజల కష్టాలు తెలిసేవి కావు. నలుగురికి సాయపడాలనే మనసూ ఉండేది కాదు.. భవిష్యత్లో ఉస్మానియాలో చదివే వేలాది మంది పేదల కోసం నా సంపాదన ఖర్చు చేస్తాను. నా డబ్బుతో నా పిల్లలు జీవించ కూడదు. పేదింటి పిల్లలకు ఆ డబ్బు ఉపయోగపడాలన్నది నా ఫిలాసఫీ. అదే రేపటి నా కార్యాచరణ. అనుభవిస్తేనే కొన్ని బాధలు అర్థమవుతాయి. పేదల బాధలు కథలు చదివితే అర్థమయ్యేవి కావు.
‘నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరనుకుంటా! జీవితంలో నాకు దక్కిన గొప్ప అవకాశం వృద్ధాప్యంలో మా అమ్మను చూసుకునే అవకాశం రావడం. అమ్మ తన జీవితంలో చివరి పది సంవత్సరాలు నా దగ్గరే గడిపింది. నాకు జ్వరం వచ్చినా, కష్టమొచ్చినా చిన్నప్పుడు అమ్మే చూసుకునేది. పెద్ద వయసులో ఆమెకు కష్టాలు వస్తే నేను చూసుకున్నాను. గొప్ప చదువులు చదివినందుకు, పెద్ద ఉద్యోగం వచ్చినందుకు, సంపాదించినందుకు కలిగే ఆనందం కన్నా చివరి రోజుల్లో అమ్మను చూసుకున్నందుకే ఎక్కువ ఆనందం కలిగింది. ఈ జీవితానికి ఈ సంతోషం చాలనే సంతృప్తి నాకు మిగిలింది.’ అని సంతోషంగా చెబుతున్నారు గోపాలకృష్ణ.
అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాను. ఓ రోజు బాగా ఆటాడాను. సాయంత్రం 4:30 గంటలకు ఇంటికి చేరాను. కడుపులో ఆకలి నకనకలాడుతున్నది. ‘అమ్మా… ఆకలవుతున్నది’ అన్నాను. ‘అన్నం వండుతాను. అరగంట ఆగు’ అని గ్లాసుడు మంచి నీళ్లు ఇచ్చింది. వంట అయిన తర్వాత అన్నం తిన్నాను. ఆ రోజు బాగా ఆకలిగా ఉండే రోజు తినే కంటే ఎక్కువే తిన్నాను. రాత్రి అందరం పడుకున్నాం. మేం నిద్రపోయామనుకుని అమ్మా, నాన్న మాట్లాడుకుంటున్నారు. ‘వాడికి ఎంత ఆకలేసిందో? ఈ రోజు మనకు శనివారం ఉపవాసం అనుకుందాం’ అని నాన్న అన్నాడు. ఆ మాటలు నా చెవినపడ్డాయి. నేను ఎక్కువ తినడం వల్ల అమ్మానాన్నకు ఏమీ మిగల్లేదని అప్పుడు అర్థమైంది. నా వల్ల వాళ్లిద్దరూ ఆ రాత్రి ఆకలితో ఉన్నారు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. మౌనంగా ఏడుస్తూ ఉండిపోయాను. జీవితంలో ఇంకెప్పుడూ ఆ తప్పు చేయకూడదని, అందరూ తిన్న తర్వాతనే నేను తినాలని నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడూ అలాగే ఉన్నాను. నా వల్ల వాళ్లు అన్నం తినని ఆ రోజు గుర్తుకు వస్తే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి.