కార్పొరేషన్, ఏప్రిల్ 21: ‘ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ బాటను వీడలేదు. మానవతా దృక్పథంతో ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి సాయం చేస్తుంది’ అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. అర్ధాకలితో ఏ ఒక్కరూ అలమటించవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి 2 వేల నగదు, 25 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వాల్మీకి విద్యాలయంలో ప్రైవేట్ సిబ్బందికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే కలెక్టర్ శశాంకతో సమీక్షించారు. తదనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో 3027 మంది ఉద్యోగులకు 2వేల చొప్పున అందించామని, 441 రేషన్ షాపుల ద్వారా 76 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. యూ డైస్లో నమోదు చేసుకోనివారికి సైతం సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘ప్రైవేట్ దవాఖానలు కరోనా రోగులకు మానవతా దృక్పథంతో చికిత్స అందించాలి.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వైరస్ బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ను బ్లాక్ చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం’ అంటూ హెచ్చరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నందునా ప్రైవేట్ హాస్పిటళ్లపై నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. వైద్యులు, నిర్వాహకులు మందుల సరఫరా, వినియోగం, ఇతరత్రా లెక్కలను పక్కాగా చూపాలని నిర్దేశించారు. మందులను అక్రమంగా నిల్వచేసినా, ఇతరులకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని, సామన్యుల ఆరోగ్య పరిరక్షణే సర్కారు ప్రథమ కర్తవ్యమని తేల్చిచెప్పారు. కలెక్టర్ నేతృత్వంలో త్వరలోనే విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి కరోనా కేసులను పర్యవేక్షిస్తామని చెప్పారు. కొవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రైవేట్ దవాఖానలకు సరఫరా అయినా రెమ్డెసివిర్, ఇతర మందుల్ని ఏయే పేషెంట్లకు ఎప్పుడు, ఎంత మోతాదులో వినియోగించారో పక్కాగా లెక్కలు నిర్వహించాలన్నారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారులు ప్రత్యేక తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందితో రెండు రోజుల్లో పటిష్ట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మందులను అత్యవసర వినియోగం కోసం తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర మందులు సరఫరాపై ఇప్పటికే ఉన్నతాధికారులు, ఫార్మా కంపెనీలతో మాట్లాడా మన్నారు. సకాలంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కరోనా కేసుల విషయంలో ప్రజలు అపోహలను నమ్మవద్దని సూచించారు. కొన్ని దవాఖానలు రెమ్డెసివిర్ను బ్లాక్ చేసి 20 వేలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై చర్యలు చేపడుతామన్నారు. అవసరమున్న దవాఖానలకు తామే అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్రెడ్డి, కార్పొరేటర్ బండ సుమ, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగరి శేఖర్రావు, విద్యా సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.