పరీక్ష పెడుతున్న పిచ్పై హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఆకట్టుకున్నా.. సహచరులు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్లోనూ అద్భుతాలు చేయలేకపోయింది. స్వల్ప ఛేదనలో ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపిస్తే.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ అతడికి సహకారం అందించారు. మూడు పరాజయాల తర్వాత ఈ మ్యాచ్తో పంజాబ్ తిరిగి గెలుపు పట్టాలెక్కగా.. ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది!
చెన్నై: హ్యాట్రిక్ పరాజయాల అనంతరం సమిష్టిగా సత్తాచాటిన పంజాబ్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (33; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ (35 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పంజాబ్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 132 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. హుడా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో డికాక్ (3) ఔట్ కాగా.. క్రీజులో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఇషాన్ కిషన్ (6)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ పంపాడు. ఫలితంగా 7 ఓవర్లు ముగిసే సరికి ముంబై 26/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్కు సూర్యకుమార్ అండగా నిలువడంతో ముంబై కాస్త కోలుకుంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదిన ఈ జంట 16వ ఓవర్లో జట్టు స్కోరును వంద దాటించింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో.. ముంబై ధాటిగా ఆడలేకపోయింది. ఈ క్రమంలో రోహిత్ 40 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నా.. ఆఖరి ఓవర్లలోనూ ముంబై గేర్ మార్చలేకపోయింది. ఆ జట్టు చివరి 5 ఓవర్లలో 34 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోయింది.
ఛేజింగ్లో పంజాబ్కు మెరుపు ఆరంభం లభించింది. కృనాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు బాదితే.. మయాంక్ అగర్వాల్ (25) ఓ సిక్సర్ కొట్టాడు. బౌల్ట్ ఓవర్లోనూ అగర్వాల్ రెండు ఫోర్లు అరుసుకోవడంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 45/0తో నిలిచింది. తొలి వికెట్కు 53 పరుగులు జోడించాక మయాంక్ ఔట్ కాగా.. అక్కడి నుంచి ఇన్నింగ్స్లో వేగం తగ్గింది. రాహుల్ చాహర్ (1/19), జయంత్ యాదవ్ (0/20) పకడ్బందీ బౌలింగ్తో విజృంభించడంతో రాహుల్, గేల్ భారీ షాట్లు ఆడలేకపోయారు. ఒక దశలో పంజాబ్ 32 బంతుల పాటు బౌండ్రీ కొట్టలేకపోయిందంటే ముంబై బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువ లేకపోవడంతో పంజాబ్ పని సులువైంది.
జట్టు ఆ గె ఓ నె,ర పా
బెంగళూరు 4 4 0 1.00 8
చెన్నై 4 3 1 1.14 6
ఢిల్లీ 4 3 1 0.42 6
ముంబై 5 2 3 -0.03 4
పంజాబ్ 5 2 3 -0.42 4
హైదరాబాద్ 4 1 3 -0.22 2
కోల్కతా 4 1 3 -0.7 2
రాజస్థాన్ 4 1 3 -1.01 2
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్రేట్, పా-పాయింట్లు
ముంబై: డికాక్ (సి) హెన్రిక్స్ (బి) హుడా 3, రోహిత్ (సి) అలెన్ (బి) షమీ 63, ఇషాన్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 6, సూర్యకుమార్ (సి) గేల్ (బి) బిష్ణోయ్ 33, పొలార్డ్ (నాటౌట్) 16, హార్దిక్ (సి) హుడా (బి) అర్శ్దీప్ 1, కృనాల్ (సి) పూరన్ (బి) షమీ, జయంత్ (నాటౌట్) 0,
ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 131/6. వికెట్ల పతనం: 1-7, 2-26, 3-105, 4-112, 5-122, 6-130, బౌలింగ్: హెన్రిక్స్ 3-0-12-0, హుడా 3-0-15-1, షమీ 4-0-21-2, బిష్ణోయ్ 4-0-21-2, అలెన్ 3-0-30-0, అర్శ్దీప్ 3-0-28-1.
పంజాబ్: రాహుల్ (నాటౌట్) 60, మయాంక్ (సి) సూర్యకుమార్ (బి) చాహర్ 25, గేల్ (నాటౌట్) 43, ఎక్స్ట్రాలు: 4, మొత్తం: 17.4 ఓవర్లలో 132/1. వికెట్ల పతనం: 1-53, బౌలింగ్: బౌల్ట్ 2.4-0-30-0, కృనాల్ 3-0-31-0, బుమ్రా 3-0-21-0, చాహర్ 4-0-19-1, జయంత్ 4-0-20-0, పొలార్డ్ 1-0-11-0.