Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు రేవంత్ సర్కారును తీవ్రంగా వ్యతిరేతికిస్తున్నారు. ఇదేం పాలన..ఇదేమి మార్పు బాబోయ్ అంటూ ఈసడించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత పదేండ్లలో స్థిరమైన ప్రభుత్వం – సమర్థవంతమైన నాయకుడిగా కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు.
గడిచిన నాలుగు నెలలుగా కొత్త ప్రభుత్వ పాలనపై వేచి చూసే ధోరణిలో కనబడిన ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికలు ఒకవైపు..మరోవైపు తాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలతో కష్టాలు, నిలిచిన అభివృద్ధి పనులు..ఆమడ దూరంలో సంక్షేమ ఫలాలు వెరసి..ప్రజలు ఒక్కసారిగా నిరసన గళం వైపు అడుగులు వేశారు. ఇదే విషయాన్ని రోజుకో చోట ప్రభుత్వంపై జరుగుతున్న నిరసనలు, సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత, ప్రచార పర్వంలోకి వెళుతున్న సందర్భాల్లో అభ్యర్థుల ప్రజా స్పందనలే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తుందని ఎదురుచూసిన జనాలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నది. ఇదే సమయంలో కొత్త ప్రభుత్వంపై కొన్నాళ్లు సర్దుకునే అవకాశం ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ.. కొన్ని రోజులుగా రైతాంగం తీవ్రంగా నష్టపోవడం, కరెంట్ కోతలు, నీటి ఎద్దడి అధికం కావడంతో బాధ్యతగల ప్రతిపక్ష నేతగా బస్సు యాత్రతో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం.. జనం స్పందన చూస్తున్న తీరుతో రాజకీయ ముఖచిత్రమే కాదు, అసలైన ప్రజాస్పందన బయటకు వచ్చింది.
గత పదేండ్లలో హైదరాబాద్ నగరం ప్రతి రంగంలోనూ వృద్ధిని నమోదు చేసుకుందని, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అతి తక్కువ సమయంలోనే వచ్చేవని పెట్టుబడిదారుల్లోనూ విస్తృత చర్చ జరుగుతున్నది. గడిచిన ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వాపోతున్నారు.
కరెంట్ పోతే చాలు.. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్న చర్చ గ్రేటర్ జనాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని, హైదరాబాద్లో విద్యుత్ సరఫరాను దేశమే అబ్బురపడేలా మెరుగుపరిచారని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో అపార్టుమెంట్లకు పోతే ఇన్వర్టర్లు ఉండేవని, పరిశ్రమలే బంద్ అయ్యే పరిస్థితి ఉండేదని.. మళ్లీ ఆనాటి పరిస్థితులే ప్రస్తు తం దర్శనమిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేని రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్ది.. నిరంతర విద్యుత్ను అందించారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ పవర్ హైల్యాండ్ను ఏర్పాటు చేసి, విద్యుత్ను ఉత్పత్తి చేసే చోటు నుంచి సరఫరా నిలిచిపోయినా మరో ఉత్పత్తి కేంద్రం నుంచి సరఫరా జరిగేలా నెట్వర్క్ను ఏర్పాటు చేసిన విషయాన్ని నగర వాసులు చెబుతున్నారు.
తాగునీటి ఎద్దడిపై ప్రజలు మండిపడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఖాళీ కుండల ప్రదర్శనలు, ప్రతిపక్ష పార్టీల నిరసనలతో దద్దరిల్లే పరిస్థితి నుంచి కేసీఆర్ పాలన నీటి కష్టాలకు చరమగీతం పాడిందన్నారు. గత ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా రెండు జీవ నదులు కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తరలించి నీటి ఎద్దడిని దూరం చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ మూడు రోజులైన దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు. బస్తీల్లో వాటర్ ట్యాంకర్ వస్తే పానీ పాట్లు తప్పడం లేదని, అరకొర వాటర్తో ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ తెచ్చిన మార్పుతో ప్రజల కష్టాలు అధికమయ్యాయని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రజలతో పాటు రూరల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హాట్ హాట్ చర్చ గ్రేటర్ జనాల్లో జరుగుతున్నది.