OU | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: ‘యూనివర్సిటీలోని బోర్డర్స్కు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది. బోర్డర్స్ అందరూ సహకరించాలి.. ఇదీ… ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు. ప్రస్తుతం ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. తెలంగాణలో నెలకొన్న కరెంటు, తాగు, సాగునీటి కొరతకు చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు నిదర్శనమంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
గత నాలుగు నెలలుగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ వాస్తవంగా రాష్ట్రంలో కొరతలు, కోతలు ఉన్నది నిజమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ట్వీట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలు ఉస్మానియా యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, జలమండలి అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎలాంటి కొరతలు లేవంటూ వరుసగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. చివరకు భట్టి కూడా ఇదంతా అవాస్తవమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
వాస్తవానికి ప్రతి ఏటా సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేయడం సాధారణమే. కాకపోతే తీవ్ర నీటి, కరెంటు కొరత ఉందని చీఫ్ వార్డెన్ అందులో ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల కిందట లేడీస్ హాస్టల్ విద్యార్థినులు తమకు వారం రోజులుగా మంచినీటి సరఫరా లేదని, అందరికీ ఒక్క ట్యాంకర్ ఇస్తే దానికి పూజ చేయాలా? అంటూ మండిపడుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేయడంతో విద్యార్థులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
యూనివర్సిటీ చరిత్రలో ఏనాడూ నీరు, విద్యుత్ ఎద్దడి నేపథ్యంలో సెలవులు ప్రకటించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్కు అంతరాయం లేకుండా సరఫరా ఉండేదని, తాగునీరు, సాగునీటికి సైతం ఇబ్బంది కలుగలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితి ఘోరంగా తయారైందని వాపోయారు.
మరోవైపు మానేరు హాస్టల్లో తాగునీటి శుద్ధి ప్లాంటు పాడవడంతో విద్యార్థులు తాగునీటి కోసం చీఫ్ వార్డెన్ కార్యాలయంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆర్వో ప్లాంటును వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో యూనివర్సిటీ విద్యార్థులు అటు యూనివర్సిటీ అధికార యంత్రాంగం, ప్రభుత్వంపై మండిపడ్డారు.
యూనివర్సిటీ హాస్టల్స్ (మెస్లు) చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసును జత చేస్తూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘గత నాలుగు నెలలుగా తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి సరఫరాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి కొరత ఉందనేది వాస్తవం’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్గా మారింది. అప్పుడుగానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సర్కారు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొదలు అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తొలుత చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు ఫేక్ అని ప్రకటించాలనే యోచన చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
కానీ అప్పటికే సోషల్ మీడియాలో అంతా వైరల్ కావడం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించడంతో సీన్ రివర్స్ అయింది. చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా… అన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ఇవ్వడం సాధారణమేనన్నారు. ఓయూలోనూ ఎన్నో ఏళ్లుగా ఇదే రీతిన నోటీసు ఇస్తామన్నారు. అన్ని హాస్టళ్లలో విద్యుత్, ఇతర మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుందని, ఆ నేపథ్యంలో సెలువులు ఇచ్చామని వివరించారు. నోటీస్లో కొన్ని క్లరికల్ తప్పిదాలు దొర్లాయని చీఫ్ వార్డెన్ చెప్పడం గమనార్హం. క్లరికల్ తప్పులంటే సాధారణంగా అక్షరాలు తప్పు పడతాయేగానీ.. మొత్తం భావమే తప్పుగా ఉంటే దానిని క్లరికల్ తప్పిదంగా చెప్పడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.
యూనివర్సిటీలో నీరు, కరెంటు కొరత విషయం అధికారికంగా వెల్లడి కావడంతో ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులపై సీరియస్ అయినట్లుగా తెలిసింది. దీంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ వెంటనే చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సదరు నోటీసులో అనవసరమైన, తప్పుదోవ పట్టించే అంశాలను పేర్కొన్నట్లు అందులో ప్రస్తావించారు. వాస్తవానికి ఎలాంటి నీటి, కరెంటు కొరత లేదని, కానీ చీఫ్ వార్డెన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అయోమయాన్ని సృష్టించారన్నారు. వెంటనే చీఫ్ వార్డెన్ హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాలని, నిర్ణీత సమయంలో సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసులో స్పష్టం చేశారు.
కాగా ఇదే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించారు. సికింద్రాబాద్ ఎస్ఈ, డీఈ కూడా వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి కరెంటు కోతలు లేవని, 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి రెండు 11కేవీ ఫీడర్స్ ద్వారా నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నట్లు ఎలాంటి కరెంటు కోతలు లేవని చెప్పారు. మరోవైపు జలమండలి అధికారులు కూడా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. యూనివర్సిటీతో ఒప్పందం మేరకు రోజుకు 505 కిలో లీటర్ల మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. అంతకుమించి రోజుకు 1271 కిలో లీటర్లు సరఫరా చేస్తున్నామని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు.