Cash | ముంబై, ఏప్రిల్ 29: భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉన్నదని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్స్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ తాజాగా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న నేపథ్యంలో నిజంగా ఇది ప్రాధాన్యత గల అంశమే. ఓవైపు యూపీఐ పేమెం ట్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నా.. ప్రజల్లో నగదు వినియోగానికున్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.
ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 2023-24లో ఏటీఎంల్లో 5.51 శాతం క్యాష్ విత్డ్రాయల్స్ పెరిగాయని సోమవారం సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ తమ నివేదిక ‘అన్ఫోల్డింగ్ ఇండియాస్ కన్జంప్షన్ స్టోరీ’లో వెల్లడించింది. నాడు రూ.1.35 కోట్లేనని తెలిపింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నగదు ఉపసంహరణలు పెరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. గతంతో చూస్తే 10.37 శాతం పెరిగాయి మరి. సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో 3.94 శాతం, సెమీ-మెట్రో నగరాల్లోనూ 3.73 శాతం క్యాష్ విత్డ్రాయల్స్ ఎక్కువయ్యాయి. ఏటీఎంల నుంచి నెలవారీ క్యాష్ విత్డ్రాయల్స్ సగటులో రాష్ర్టాలవారీగా చూస్తే.. రూ.1.83 కోట్లతో కర్నాటక ముందున్నది. న్యూఢిల్లీ (రూ.1.82 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.1.62 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.