Bhatti Vikramarka | ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. ఓయూలో విద్యుత్, తాగునీరు కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వెను వెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు.
తాగునీరు, విద్యుత్ కొరత మూలంగా మే ఒకటి నుంచి, 31 మే వరకు ఓయూ హాస్టల్స్, మెస్లు మూసి వేసున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని, దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీటి సదుపాయాలను వెనువెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చన్నారు.