కేరళలోని వయనాడ్లో ఇటీవల పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్గాంధీకి అసలు మానసిక రాజకీయ సంక్షోభం మొదలైంది. నెహ్రూ-గాంధీ పరివారానికి పెట్టని కోటలుగా ప్రచారంలో ఉన్న రాయ్బరేలీ, అమేఠీ పార్లమెంటు స్థానాల్లో తమ కుటుంబసభ్యులు ఇద్దరూ పోటీ చేయాలా? లేదా ఒక్కరైనా బరిలోకి దిగాలా? అనే ధర్మసంకటం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీని ఇంకా పీడిస్తూనే ఉన్నది.
18వ లోక్సభ ఎన్నికలు ఐదో దశలో భాగంగా మే 20న పోలింగ్ జరిగే ఈ రెండు ప్రతిష్ఠాత్మకమైన స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కిందటి ఎన్నికల్లో రాహుల్ను అమేఠీలో ఓడించి సంచలనం సృష్టించిన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మొదటి రోజే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు ‘కుటుంబ’ సీట్లలో అన్నాచెల్లెళ్లు పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఆదివారం సమావేశమైంది. అయితే ఆ కమిటీ తర్జనభర్జన పడినప్పటికీ చివరికి ఎటూ తేలకుండానే సమావేశం ముగియడం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సందిగ్ధతకు అద్దం పడుతున్నది.
కాంగ్రెస్ అగ్రనేతల పోటీపై రెండు మూడు రోజుల్లో చెప్తామని, ఇంకా సమయం ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనకు ముందే లీకులు జోరందుకున్నాయి. ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని, అబ్బే అదేం కాదు, త్వరలో రాయ్బరేలీ నుంచి రాహుల్, అమేఠీ నుంచి ప్రియాంక నామినేషన్లు వేస్తారని… ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి ఆదివారం మీడియాకు లీకులు అందాయి.
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి బీజేపీకి కంచుకోటగా మారిన ఉత్తరప్రదేశ్లో పరిస్థితి కొంత మారిందని, బీజేపీకి ఆ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో 40కి మించి రావని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయినా రాయ్బరేలీ, అమేఠీలో పోటీ చేయడానికి అన్నాచెల్లెళ్లకు ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ నాయకులే లోపాయికారిగా మీడియాకు ఉప్పందిస్తున్నారు. పోటీ చేస్తే ఒక తంటా, చేయకపోతే మరో తంటా అన్నట్టు తయారైంది కాంగ్రెస్ అగ్రనేత పరిస్థితి. రెండోసారి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలైతే పరువు పోతుందనే అనుమానం రాహుల్ను వెంటాడుతున్నట్టుంది. అందుకే ఆయన ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రెండు సీట్ల జోలికి పోకుండా పోటీకి దూరంగా ఉందామనుకుంటే.. ఓటమి భయంతోనే బరిలోకి దిగడం లేదనే ప్రచారం జరిగే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నది.
అవి సొంత జాగీర్లా?: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్గాంధీ మొదటి రెండు పార్లమెంటు ఎన్నికల్లో (1952, 57) రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరణించే వరకు ఆయన రాయ్బరేలీ ఎంపీగానే కొనసాగారు. ఈ కారణంగానే 1967లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ మొదటిసారిగా లోక్సభ బరిలో దిగారు. అప్పటి నుంచి ఆమె వరుసగా 1971, 1977, 1980లో కూడా అక్కడి నుంచే బరిలోకి దిగారు. 1980లో తొలిసారి మెదక్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన ఆమె రెండుచోట్లా గెలుపొందారు. అనంతరం మెదక్ ఎంపీగా కొనసాగి, రాయ్బరేలీ స్థానానికి రాజీనామా చేశారు. మరణించే సమయానికి ఆమె మెదక్ ఎంపీగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే.
అలహాబాద్లో పుట్టి పెరిగిన నెహ్రూ మూడుసార్లు (1952, 1957, 1962) అలహాబాద్, అలహాబాద్ జిల్లాలో అంతర్భాగమైన ఫూల్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే తండ్రి పోటీచేసి గెలిచిన, ఇందిరమ్మ పుట్టిన అలహాబాద్ ప్రాంతం ఎందుకో మరి నెహ్రూ-గాంధీ కుటుంబానికి ‘ఇంటి నియోజకవర్గం’ కాలేకపోయింది. రెండుసార్లు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్, ఆయన కన్నుమూశాక సొంత మేనత్త విజయలక్ష్మీ పండిత్ ఉప ఎన్నికలో గెలిచిన రాయ్బరేలీ మాత్రమే దేశానికి ప్రథమ కుటుంబంగా చెప్పుకొనే నెహ్రూ-గాంధీ పరివారానికి ‘సొంతూరు లేదా సొంత సీటు’గా మారడానికి కారణాలు లేకపోలేదు.
అలహాబాద్, ఫూల్పూర్ స్థానాలు ప్రధానంగా నగర ప్రాంతాలు. నగర ఓటర్లు ఎక్కువగా ఉన్న ఆ స్థానాల్లో గెలుపు అంత తేలిక కాదు. సునాయాసంగా గెలిచేందుకు అవి అనుకూలం కాదు. అందుకే 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంత ఓటర్లున్న రాయ్బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారింది. అక్కడి అమాయక ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తారనే భావనతోనే ఇందిరమ్మ కుటుంబం ఆ స్థానాన్ని తమ కంచుకోటగా ఎంచుకున్నది.
అయితే అదే కంచుకోట రాయ్బరేలీ ఎమర్జెన్సీ ముగిసే సమయంలో జరిగిన 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని 50 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడించి, ఆధునిక ప్రజాతంత్ర భారత చరిత్రను గొప్ప మలుపు తిప్పింది. అలాగే, నియోజకవర్గాల పునర్విభజనతో అప్పుడే ఉనికిలోకి వచ్చిన పక్క పార్లమెంట్ స్థానం అమేఠీ నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ చిన్న కొడుకు సంజయ్గాంధీ కూడా తల్లితో పాటే పరాజయం పాలయ్యారు.
ప్రియాంకను ఎన్నికల బరిలోకి దించరా?: 1980 ఎన్నికల్లో సంజయ్గాంధీ అమేఠీ నుంచి మాత్రమే పోటీ చేశారు. కానీ, ఇందిర మాత్రం మెదక్ నుంచి కూడా బరిలో దిగారు. ఒక్క ఓటమితోనే ధైర్యశాలి ఇందిరమ్మకు రాయ్బరేలీపై నమ్మకం సడలింది. అలాగే ఆమె పెద్ద కోడలు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తొలిసారి 1999లో పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాక రాయ్బరేలీతో పాటు కర్ణాటకలోని బళ్లారి నుంచి కూడా బరిలోకి దిగారు. రాయ్బరేలీపై నమ్మకం లేకనే ఆమె రెండు చోట్లా బరిలోకి దిగారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన ఆమె బళ్లారి స్థానానికి రాజీనామా చేసి రాయ్బరేలీ ఎంపీగా కొనసాగారు. అప్పటి నుంచి ఆమె రాయ్బరేలీ ఎంపీగానే కొనసాగారు.
ఈ నెల ఆరంభంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఎన్నికవడంతో ఆమెకు రాయ్బరేలీతో ఉన్న బంధం తెగిపోయింది. 2004, 2009, 2014లో లోక్సభకు పంపిన అమేఠీలో ఓటమిపాలయ్యే సూచనలు కనిపించడంతో 2019లో రాహుల్గాంధీ కేరళలోని కాంగ్రెస్ కంచుకోట వయనాడ్కు వలస వెళ్లిపోయారు. అక్కడి నుంచి పోటీ చేసి తన పార్లమెంటు సభ్యత్వాన్ని నిలుపుకొన్నారు. గతంలో తన చేతిలో ఓటమిపాలైన స్మృతి ఇరానీ 2019లో ఘన విజయం సాధించడం రాహుల్ ఎన్నటికీ మరవలేని షాక్గానే చెప్పుకోవాలి.
అదృష్టవశాత్తూ రెండో దశలో ఎన్నికలు జరిగిన కేరళ వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. ఇప్పుడు అమేఠీ, రాయ్బరేలీలో నామినేషన్ దాఖలుపై గుంపుచింపులు పడుతున్నారు. ఎంత పెద్దనాయకుడైనా సొంత స్థానంలో ఓటమి ఛాయలు కనిపిస్తే రెండో స్థానం నుంచి పోటీ చేయడంలో తప్పు లేదు. మాజీ ప్రధానులు ఇందిర, వాజపేయి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వంటి దిగ్గజాలు కూడా ఇలాగే రెండు చోట్ల నుంచి పోటీ చేసినవారే. కానీ, రాయ్బరేలీ, అమేఠీ పార్లమెంట్ స్థానాలు తమ కుటుంబానికి కంచుకోటలు అని చెప్పుకొంటూనే అక్కడి నుంచి పోటీపై నెహ్రూ-గాంధీ వారసులు ఇంతగా వెనకాముందూ ఆలోచించడం వారి రాజకీయ అపరిపక్వతకు, ఓటమి భయానికి నిదర్శనం.
ఇక తెలుగు ప్రాంతం విషయానికి వస్తే.. తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినాయకుడు కె.చంద్రశేఖర్రావు తన సొంతూరు, ప్రధానంగా పట్టణ ప్రాంతం మూడొంతుల వరకు ఉన్న సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
జననేతగా పేరు ప్రఖ్యాతులు వచ్చాక ఎన్టీఆర్, కేసీఆర్, మర్రి చెన్నారెడ్డి వంటి పెద్ద నాయకులు తమ సొంతూళ్లకు ఎంతో దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. అలాంటిది కుటుంబ కంచుకోటలుగా చెప్పుకొనే రెండు సీట్ల నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేతలు వెనుకాడటం ఆ పార్టీ ఎంతటి దీనస్థితిలో ఉందో చెప్పకనే చెప్తున్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 సీట్లలో తాము 14 గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికో అర్థం కావడం లేదు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 20 ఏండ్లుగా కాంగ్రెస్ అమ్ములపొది నుంచి వదిలిన బ్రహ్మాస్త్రంగా ఊరూవాడా పేరుమోసిన ప్రియాంకావాద్రా ఇప్పుడు 52 ఏండ్లు దాటుతున్న సమయంలోనైనా పార్లమెంటుకు పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటనేది ఇంకా తేలలేదు. గెలుపు గ్యారెంటీ అన్న చోట నుంచి బరిలోకి దిగడం లేదా పోటీకి దూరంగా ఉండటానికి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలోని పెద్ద కుటుంబాల నేతలే పోటీ చేయడానికి వెనుకడుగువేస్తుంటే ఇక సాధారణ నాయకుల పరిస్థితి ఏమిటని కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తు న్నారు? అగ్రనేతలకే నమ్మకం లేకుంటే వాళ్లను ప్రజలెలా నమ్ముతారు, నమ్మి ఓటెలా వేస్తారు?
– నాంచారయ్య మెరుగుమాల