ముఖ్యమంత్రి కేసీఆర్
ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం
రాజన్న సిరిసిల్ల, జూలై 4(నమస్తే తెలంగాణ): గోదావరి పరీవాహక ప్రాంతంలో గ్యాప్ ఆయకట్టు లేకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఆదివారం అధికారులతో సమీక్షిం చారు. బాల్కొండ, జగిత్యాల, ధర్మపురి, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో గ్రావిటీ కెనాల్, నీటి సౌలభ్యం ఉన్నచోట లిఫ్ట్లు నిర్మించాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించాలన్నారు. సిరిసిల్లలోని మురుగునీరు మధ్యమానేరులో కలువకుండా చూడాలన్నారు. వేములవాడ, కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, గోదావరిఖని పట్టణాల్లో డ్రైనేజీ, డిస్పోజల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని రామగుండం, కరీంనగర్ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, శంకర్ను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖల మంత్రి ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ హరిరాం, కలెక్టర్ కృష్ణభాస్కర్, అమరేందర్రెడ్డి, ప్యాకేజీ 9 ఈఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.