హైదరాబాద్: కెనడాలోని టొరంటోలో తెలంగాణ (Telangana) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతుండటంతో కెనడాలో (Canada) స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో టొరంటోలోని మిసిసాగలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు.
ప్రొఫెసర్ జయ శంకర్ స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో 2005లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఏర్పాటుశామని టీడీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పెద్ది అన్నారు. ఉద్యమకాలంలో సొంత రాష్ట్రం కోసం ఎంత ఆరాట పడ్డామో, సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం వైపు పయనించేలా తమవంతు పాత్ర ఇప్పటికీ తెలంగాణ ఎన్నారైలు పోషిస్తున్నారని చెప్పారు. ఎన్ఆర్ఐలు అంటే బతికేందుకు బయటి దేశం పోయినోళ్లు కాదని, రాష్ట్ర సాధనతో పాటు నిర్మాణంలోనూ పాటుపడుతున్నామనే ఆదర్శంతో టీడీఎఫ్ పనిచేస్తుందని అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి తెలిపారు. తెలంగాణ అస్థిత్వానికి కృషి చేసిన కవులు, కళాకారులను స్మరించి గౌరవిస్తూ సన్మానించుకోవటం, అమరుల కుటుంబాలను తోచినంతలో ఆదుకోవటం టీడీఎఫ్ ద్వారా చేస్తున్నామని వెల్లడించారు.
ఇక కెనడాలో స్థిరపడాలని వచ్చే వృత్తి నిపుణులకు అవసరమైన సలహాలు, సూచనలతోపాటు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్న తెలుగు విద్యార్థులకు అండగా టీడీఎఫ్ నిలుస్తున్నదని తెలిపారు. నిత్య జీవిత ఒత్తిడులను జయించేందుకు ఆటపాటలే మార్గమని భావించి స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేసి క్రికెట్తోసహా వివిధ రకాల టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు భౌతికంగా దూరంగా ఉంటున్నా, పుట్టిన ప్రాంతంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలకు దూరం కాకుండా టీడీఎఫ్ గొడుగు కింద కెనడాలో అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నామని, తంగేడు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలతోపాటు, వివిధ సందర్భాల్లో కమ్యూనిటీ ఈవెంట్లను నిర్వహిస్తూ అందరం కలుస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. కెనడాలో పుట్టి పెరిగిన పిల్లలకు వారి మూలమైన తెలంగాణతో పేగు బంధం కొనసాగేలా చూసుకుంటున్నామని చెప్పారు.
టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడైన గంటారెడ్డి మాణిక్ రెడ్డి పేరుతో ఏర్పాటుచేసిన విశేష సమాజసేవ పురస్కారాన్ని పవన్ కుమార్ రెడ్డి కొండం దంపతులకు నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నెరవెట్ల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రమోద్ కుమార్ ధర్మపురి, టీడీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హాజరయ్యారు.