భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి తాయారమ్మ వారు గురువారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు కాలనీల్లో, ఆలయాల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు విశేష రూపాల్లో దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారిని పంచామృతాలతో, నదీ జలాలతో, పళ్ల రసాలతో అభిషేకం జరిపారు.
మధ్యాహ్నం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆఖరి రోజు కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం కోవెల అభిముఖంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య కు దర్భార్ సేవ నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు నిజరూప లక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.