మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధించాలి
తిరుమలాయపాలెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
తిరుమలాయపాలెం, జూలై 22: కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన.. తొలిసారిగా తిరుమలాయపాలెం మండలంలో గురువారం పర్యటించారు. సుబ్లేడు పీహెచ్సీని సందర్శించారు. కొవిడ్ సోకిన దుంపటి శివ, సాయినాథ్ ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. సుబ్లేడు, కాకరవాయిలోని ఐసొలేషన్ కేంద్రాలనూ సందర్శించి కొవిడ్ పేషంట్లతో మాట్లాడారు. సౌకర్యాలు, వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సుబ్లేడు పీహెచ్సీలో ఏర్పాటు చేసిన అధికారులు, వైద్యసిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ కొవిడ్ వివరాలను జిల్లాస్థాయి అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారికి తప్పనిసరిగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఎంపీపీ మంగీలాల్, సర్పంచ్లు సంజీవయ్య, మౌనిక, తహసీల్దారు కోట రవికుమార్, ఎంపీడీవో జయరాం పాల్గొన్నారు.