వ్యవసాయంలో కష్టం పెరిగింది. లాభం తగ్గింది. రైతు ఆలోచనా విధానం కూడా మారింది. ‘ఎట్టికి చేసి ఎవుసాన్ని నిందించొదు’్ద అనుకుంటున్నాడు రైతు. విత్తు పెట్టి ఫలం సాధించాలనుకుంటున్నాడు. కొత్త వాటికోసం అన్వేషిస్తున్నాడు. అధిక దిగుబడుల సాధనే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నాడు. సమగ్ర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అంతరసాగులో అద్భుత ఫలాలు పొందుతున్న ఆదర్శ రైతు లింబారెడ్డి విజయగాథ ఇది.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన లింబారెడ్డి ఎకరన్నర జామపంటలో అంతరపంటగా మలబారు వేప సాగుచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. లింబారెడ్డి గతంలో సంప్రదాయ పంటలైన మొక్కజొన్న, వరి పండించేవారు. అయితే వాతావరణ పరిస్థితులు, అడవి జంతువుల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యనుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయాలు పరిశీలించారు. జామసాగు మంచి ఫలితాలు ఇస్తుండటాన్ని గమనించారు. హైదరాబాద్లోని ఓ సంస్థ వద్ద తైవాన్ జామ, అలహాబాద్ సఫేద రకాలను ఒకటికి రూ. 55 చొప్పున 1350 మొక్కలు, మలబారు వేప ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున 200 కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా ఎకరన్నరలో సాగుచేశారు. జామను హైడెన్సిటీ విధానంలో నాటారు. నాలుగో నెలనుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జామ వయసు 11 నెలలు. మలబారు వేప వయసు 9 నెలలు. జామ, మలబారు మొక్కలతోపాటు అనుబంధంగా గొర్రెలు, కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. ఇందుకోసం రెండు షెడ్లను ఏర్పాటుచేశారు. తోటలో పెరిగిన గ్రాసం వాడటం వల్ల రైతుకు అదనపు ఆదాయం వస్తున్నది. జామనుంచి రోజూ వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో ఈ సాగును విస్తరించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
మొత్తం నాలుగు ఎకరాల భూమి. ఎకరన్నరలో తైవాన్ జామ, అలహాబాద్ సఫేద సాగు, అంతరపంటగా మలబారు వేప.. ఇదీ లింబారెడ్డి ప్రణాళిక. సాగునీరు సక్రమంగా పారిస్తూ మూడేండ్లలోనే మార్కెట్కు పండ్లు తీసుకెళ్లారు. రోజూ 40-60 కిలోల జామ పండించడం మొదలుపెట్టారు. అంతరపంటగా సాగుచేసిన మలబారు వేప వయసు తొమ్మిది నెలలు. జామ పదకొండు నెలలు. ఎలా చూసుకున్నా ఏడాది పొడవునా పంట దిగుబడి అవుతుంది. దానికితోడు లింబారెడ్డి నాటుకోళ్లు, గొర్రెల పెంపకం మొదలుపెట్టి లాభసాటి వ్యవసాయం చేస్తున్నాడు. జామ సాగులో నెలకు రూ.40 వేల ఆదాయం కండ్ల చూస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తూ వేసవిలో వారానికి ఒక తడి ఉండేలా చూసుకున్నారు. ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువు ఉపయోగించారు. జామ మొక్కల మధ్య మీటరున్నర, సాళ్లమధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా నాటారు. నాలుగు నెలలకు ఒకసారి ఫ్రూనింగ్ చేస్తున్నారు. 20-20-13 నిష్పత్తిలో ఎరువులు వేస్తూ పంటకు ఎప్పటికప్పుడు చేవను అందిస్తూ వచ్చారు లింబారెడ్డి. 20-20-13 నిష్పత్తిలో వేపపిండి, మాగిన పశువుల ఎరువు, 3జి గుళికలు వంటి ఎరువులు వేశారు. తాను ఎంచుకున్న విధానం విజయవంతం కావడంతో లింబారెడ్డి పంట పండింది. రాబడి పెరిగింది.
ఎప్పుడూ.. వేసే పంటలే మళ్లీ వేసి నష్టపోయిన. ఏదైనా కొత్త పద్ధతిలో పోదామని నిరుడు ఒక ఎకరన్నరలో తైవాన్ జామ వేసిన. బార్డర్ క్రాప్గా మల్బరు వేపసాగు వేసిన. దీనికితోడు గొర్లు, కోళ్లు కూడా పెంచుతున్న. జామతోటపై రోజుకు కనీసం రూ. వెయ్యి ఆదాయం వస్తున్నది. నాలుగేండ్లలో మల్బరు వేపపై రాబడి వస్తది. కోళ్లు, గొర్లు పెంచడం వల్ల తోటలోని గడ్డి వాటికి మేతగా ఉపయోగ పడుతది.
–లింబారెడ్డి