గుమ్మడిదల, డిసెంబర్22: కౌలు రైతుగా పంటలను సాగు చేసుకున్న రైతు ఇప్పుడు భూస్వామి అయ్యాడు. కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ శివారులోని గ్రీన్ ఎకర్లో రైతుహనీఫ్ కూరగాయలను పండిస్తున్నాడు. ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డిమాండ్ తగ్గుట్టు కూరగాయల పంటలను సాగు చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. రైతు హనీఫ్ సాగు చేస్తున్న పంటలను రాష్ట్ర, జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు, వివిధ రాష్ర్టాల రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అభినందిస్తున్నారు.
మల్చింగ్, పందిరి, డ్రిప్ పద్ధతిలో బీరకాయ పంట సాగు చేస్తున్నాడు. ఎకరా బీర సాగుకు దాదాపు రూ.లక్షన్నర ఖర్చు అవుతాయని, ఇందులో 25 టన్నులు బీర పంట దిడుబడి వస్తుందని రైతు తెలిపాడు. పెట్టుబడి, కూలీల ఖర్చు పోను ఎకరాకు సుమారుగా రూ.4 లక్షలు దిగుబడి సాధిస్తుందని, 12 ఎకరాల్లో రూ.50 లక్షల ఆదాయం సంపాదించవద్చని వివరించాడు. వరి సాగుకన్నా కూరగాయల సాగుతోనే ఆదాయం ఎక్కువగా వస్తుందని చెబుతున్నాడు. రైతులకు కూరగాయల సాగుతో మంచి లాభాలు వస్తాయని వ్యవసాయాధికారులు, ఉద్యానవశాఖ అధికారులు సూచిస్తున్నారు.
గ్రీన్ ఎకర్లో వరి పంట సాగుకు ప్రతికూల పరిస్థితుల్లో కూరగాయల పంటలపై రైతు హనీఫ్ దృష్టి సారించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలను వినియోగించుకుని కూరగాయలను సాగు చేశాడు. ఆధునిక పద్ధతులను పాటించారు. తనకున్న 20 ఎకరాలలో 8 ఎకరాల్లో మామిడితోట, 12 ఎకరాలు బీర పంటను మల్చింగ్, డ్రిప్, పందిరి సాగు ద్వారా పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈబీరపంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజులకోసారి బీరకాయలను మార్కెట్కు తరలిస్తున్నారు.
కూరగాయలను మల్చింగ్, డ్రిప్, పద్ధతిలో సాగు చేస్తున్న. ప్రస్తుతం బీర పంట సాగు చేస్తున్న. మల్చింగ్ ద్వారా కలుపు ఉండదు. డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకూ ఎరువు అందిస్తా. చీడ పురుగులకు రసాయన ఎరువులు తక్కువ మొత్తంలో వాడుతాను. అధికంగా సేంద్రియ ఎరువుల వైపే మొగ్గు చూపిస్తా. సీజన్ను బట్టి పంట మార్పిడి చేస్తున్న. ఒకసారి టమాట, మరోసారి కాకర, బెండ వంటి కూరగాయల పంటలను సాగు చేస్తాను. డిమాండ్ను బట్టి కూరగాయలను సాగు చేస్తూ మంచి లాభాలు సాధించవచ్చు. కూరగాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి పెడుతారు.