ఖమ్మం, జూలై 17: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం కుటుంబ సమేంతంగా ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు మీడియాకు వెల్లడించారు.
24న ముక్కోటి వృక్షార్చన..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ పిలుపు మేరకు ఈ నెల 24న చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతం చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. యువనేతపై అభిమానాన్ని మొక్కలు నాటి చాటుకోవాలని అన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విధిగా మూడు మొక్కల చొప్పున నాటాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే వృక్షార్చననూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలన్నారు. పచ్చని మొక్కలతో పర్యావరణాన్ని సంరక్షించుకుందామన్నారు.