ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వ చర్యలు అద్భుతం
మంత్రివర్గ సమావేశంలో చర్చించడం సంతోషకరం
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆయిల్పాం రైతుల క్షీరాభిషేకం
అశ్వారావుపేట, జూలై 15: రైతు సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి నిరుపమానమని తెలంగాణ ఆయిల్పాం రైతు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆలపాటి రామచంద్రప్రసాద్, శీమకుర్తి వెంకటేశ్వరరావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణలో ఆయన రైతు పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. ఆయిల్పాం సాగు విస్తరణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మంత్రి వర్గంలో జరిపిన చర్చలు రైతులకు సంతోషాన్నిచ్చాయని అన్నారు. ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, భారీ సబ్సిడీలు ప్రకటించడంతో నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో గురువారం వారు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయిల్పాం రైతులకు మూడేళ్లపాటు రాయితీ ప్రోత్సాహకాలు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుండడం సంతోషకరమని అన్నారు. సాగు విస్తరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి తుమ్మల, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ప్రోత్సాహాన్నిస్తున్న సీఎం కేసీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.