Dussehra Celebrations in Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సింహవాహనంపై నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయముద్రలు, ఖడ్గాన్ని ధరించి సకల శుభప్రదాయనీగా భ్రమరాంబదేవి భక్తులకు దర్శనమిచింది. సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లను హంసవాహనంపై అధిష్టింపజేసి అర్చక వేదపండితులు విశేష పూజలు జరిపించారు. అకాల వర్షాలు కురవకుండా ఉండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించారు.
స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం, గ్రామోత్సవంలో భాగంగా పుష్పపల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి షోడశోపచార పూజాధికాలు చేశారు. ఆది దంపతులకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతో పాటు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులచే జానపదాలు, కోలాటాలు, చెక్క భజన, బీరప్ప డోలు, నందికోలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు వివిధ రకాల కళారూపాలతో ఉత్సవం కన్నులపండువగా సాగింది.
ఆలయ ప్రధాన ద్వారం నుంచి గంగాధర మండపం, నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు జరిగిన పుష్పపల్లకి సేవలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. గత రెండు రోజులుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగకపోవడంతో పుష్పపల్లకి ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు బారులుదీరారు. ఉత్సవ అనంతరం కాళరాత్రి పూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థాన సేవ జరిగాయి.
శరన్నవరాత్రుల్లో ఏడవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారు గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?”
“Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?”