Dussehra 2022 | విజయ దశమి రోజు జమ్మి చెట్టును పూజించడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? శమీ పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. కానీ దీని వెనుక పురాణ గాథలు అనేకం ఉన్నాయి. మరి అవేంటి? జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం..
రుగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు. త్రేతా యుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీ రాముడు శమీ పూజ చేసి వెళ్లాడంట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహా భారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట. అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి..
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం
.. అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా ఇంటికి తీసుకెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమనే అందరూ నమ్ముతారు.
జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువకాలం బతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?
Bathukamma songs | ఈ బతుకమ్మ పాటలు మీరు విన్నారా?
పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?