మునుగోడు : నల్గొండ జిల్లా మండలంలో మీసేవ( Mee Seva ), ఆధార్ ( Aadhar ) నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మునుగోడు( Munugode) మండల కమిటీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో నరేష్కు ఒక వినతిపత్రం అందజేశారు
. ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాలలో ఏదేని ఒక పనికి సంబంధించి ప్రభుత్వపరంగా సర్వీస్ రుసుము నిర్ణయించినప్పటికీ మీసేవ ఆధార్ నమోదు కేంద్రాల నిర్వహకులు సర్వీస్ పేరుతో పేదల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
కొత్త ఆధార్ నమోదుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఎలాంటి రుసుము తీసుకోకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు చొప్పున సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నారని అన్నారు. అధికంగా డబ్బులు ఇస్తే తొందరగా పూర్తి చేస్తామని అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ,అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల నాయకులు మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.