(Wax Replica) విజయవాడ : భార్య దూరమై ఆమె జ్ఞాపకాల్లో బతుకుతున్న తండ్రికి ఓ కూతురు అపురూపమైన కానుక అందించింది. తల్లి పుట్టినరోజునాడే ఆ బహుమతిని చూసిన ఆ తండ్రి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే.. చనిపోయిన తల్లి మైనం విగ్రహాన్ని తయారుచేయించిన కుమార్తె.. తండ్రికే బహుమతిగా ఇచ్చింది.
విజయవాడ చుట్టిగుంట సమీపంలో నివాసముంటున్న మండవ కుటుంబరావు సతీమణి కాశీ అన్నపూర్ణమ్మ ఇటీవల అకాల మరణం చెందింది. ఎప్పుడూ బంధువుల రాకతో సందడిగా ఉండే కుటుంబరావు ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. భార్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కుటుంబరావు నిత్యం మదనపడటం చూసిన ఆయన కుమార్తె సశ్య.. ఎలాగైనా తండ్రిని మామూలు మనిషిని చేయాలనుకున్నది. గతంలో కర్ణాటకలో ఓ వ్యక్తి భార్య మైనం విగ్రహాన్ని చేయించి గృహప్రవేశం చేసిన విషయం గుర్తుకొచ్చి.. విజయవాడలోని శిల్పశాలల్లో మైనం బొమ్మ తయారీ గురించి వాకబు చేసింది. చివరకు ఒక శిల్పశాలలో తల్లి అన్నపూర్ణమ్మ మైనం విగ్రహాన్ని తయారుచేయించింది. తల్లి పుట్టినరోజునాడే ఇంటికి తీసుకొచ్చి తండ్రికి బహుమతిగా ఇచ్చింది. ఊయల ఊగుతున్న తన భార్య నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ సజీవంగా తన పక్కనే ఉన్న అనుభూతిని చెందుతున్నాడాయన. మట్టి విగ్రహాన్ని తయారుచేసి దానికే మైనం అద్ది 40 రోజుల్లో పూర్తిచేసినట్లు శిల్పశాల నిర్వాహకుడు శ్రీసాయిబాబా తెలిపారు.
కాశీ అన్నపూర్ణమ్మ మైనం విగ్రహాన్ని చూసిన బంధువులు, గ్రామస్థులు నిజంగా ఆమె బతికి వచ్చిందా అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నారు. ఆమె విగ్రహాన్ని తాకుతూ గత స్మృతులను నెమరేసుకుంటూ చెమ్మగిల్లిన కళ్లతో వెనుదిరుగుతున్నారు. అన్నపూర్ణమ్మ విగ్రహం ఇంటికి చేరడంతో మళ్లీ కళ సంతరించుకున్నది. ఆమెను చూసేందుకు బంధువులు, గ్రామస్థులు ఒక్కొక్కరుగా వస్తుండటంతో ఇంట్లో పాతకాలం సండది నెలకొన్నది. ఆమె పుట్టినరోజును ఘనంగా జరిపి తమ ప్రేమను చాటుకున్నారు. తల్లి మైనం విగ్రహాన్ని తయారుచేయించి తండ్రికి బహుమతిగా ఇచ్చిన సశ్యను బంధువులు, గ్రామస్థులు ఎంతగానో కొనియాడారు.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..