యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రంగురంగుల చీరెలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులు కరోనాతో మరింత ఛిద్రమయ్యాయి. మరమగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి.. మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. నేటికీ ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూత, థ్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలతో ఆదుకుంటోంది. 2017లో తెలంగాణ ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా.. ప్రతి నెలా 8శాతం పొదుపు చేసిన కార్మికుడి ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేండ్ల వ్యవధి ముగిశాక అందజేస్తోంది. గత యేడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. అయితే గత ఏడాది లాక్డౌన్లో ‘చేనేతకు చేయూత’ పథకం కార్మికులకు అండగా నిలవడం తో.. ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో కార్మికులు కనిష్ఠంగా రూ.200 నుంచి రూ.1500 వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉండగా..ఈ పథకం కొనసాగింపునకు సంబంధించిన జీవో నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
‘చేనేత మిత్ర’ పథకంలో రూ.3.86కోట్ల సబ్సిడీ జమ
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40 శాతం సబ్సిడీ ఇచ్చి ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందులో 35 శాతం కార్మికులకు చెల్లిస్తుండగా.. మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి లేకుంటే గ్రూపు లీడర్కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెచ్డీసీ) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తోంది. జనగామ, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. 2018 జూన్లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది రూ.3.86కోట్ల వరకు లబ్ధిపొందారు. సిల్క్కు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్పై 12 సార్లు లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ లెక్కన మగ్గంనేసే నేత నెలకు రూ.4 నుంచి 5వేలు, అనుబంధ కార్మికుడు రూ.1 నుంచి 2వేల వరకు లబ్ధిపొందవచ్చు. జిల్లాలో 1,691 బిల్లులకు గాను రూ.4.11కోట్లను ప్రభు త్వం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్ప టి వరకు 1,601 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాలో రూ.3.86కోట్లను జమచేసింది. ఇంకా రూ.25 నుంచి 26లక్షల చెల్లింపులు జరిపితే అనుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక క్యాంపుతో లబ్ధిదారుల గుర్తింపు
జిల్లాలో 20వేల వరకు చేనేత కుటుంబాలు మగ్గాలనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాయి. చేనేత, జౌళీశాఖ అధికారుల సర్వే ప్రకారం.. జియో ట్యాగింగ్లో 5,890 మగ్గాలు ఉం డగా..3వేల మంది ఈ పథకంలో చేరారు. ఇటీవలనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి కొత్తగా 900 మంది వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు యాభై శాతం మందే ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధిపొందుతున్నారు. వివిధ కారణాల వల్ల కొం తమంది ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరలేకపోయారు. ఫలితంగా ప్రభుత్వం అందించే సాయా న్ని ఎన్నో కుటుంబాలు పొందలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా చేనేత, జౌళీ శాఖ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆరంభంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించింది. జియోట్యాగ్ కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు ఎప్పటికప్పుడు గుర్తించి ఈ పథకంలో లబ్ధిపొందేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం
కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే అమలుచేస్తున్న చేనేతకు చేయూ త, చేనేత మిత్ర పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు గొప్ప మేలును చేకూర్చుతున్నాయి. చేనేత మిత్ర పథకంలో ప్రతి నెలా కొంత స్థిర ఆదాయం కార్మికులకు సమకూరుతుంది. నూరుశాతం మంది కార్మికులకు ఈ పథకంలో లబ్ధిచేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రత్యే క చర్యలు చేపడుతున్నాం. చేనేతకు చేయూత పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే తిరిగి ప్రారంభించనుండగా.. చేనేత మిత్ర పథకంలో నూలు కొనుగోలు చేసిన కార్మికులకు సంబంధించి 1,601 బిల్లులకుగాను రూ.3.86కోట్లను చెల్లించడం జరిగింది.
-ఎం.వెంకటేశం, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత, జౌళీశాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా
ఇవీ కూడా చదవండి…
ఈ-లైబ్రరీని అందుబాటులోకి తెస్తాం
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సానుకూలం