ఆనందోత్సాహంలో రజక, నాయీబ్రాహ్మణులు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
ప్రభుత్వ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రయోజనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తుల ప్రగతికి అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ వృత్తి కొనసాగించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తూ 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందించడంపై రజక, నాయీబ్రాహ్మణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 1,500 ధోబీఘాట్లకు, 60 వేలకు పైగా లాండ్రీలకు, 10 ఆధునిక ధోబీఘాట్లకు, 85 వేలకు పైగా సెలూన్లకు విద్యుత్తు చార్జీలనుంచి మినహాయింపు దక్కనున్నది. దీంతో 4.5 లక్షల మంది రజకులకు, 2.5 లక్షల మంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలగనున్నది. ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.250 కోట్ల అదనపు భారం పడనున్నట్టు సంబంధిత విభాగాలు అంచనాలు రూపొందించాయి.
అయినప్పటికీ ఆయా వృత్తిదారులకు అండగా నిలవాలన్న సంకల్పంతో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కుల వృత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని వేగంగా అమలుచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రజక, నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేశారు. సోమవారం నాయీబ్రాహ్మణుల తరఫున హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూదిగుంట్ల నరేశ్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పెంబర్తి శ్రీనివాస్, గడలరాజు, మహేశ్, సీహెచ్ శ్రీనివాస ఆమంచి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
నెలకు రూ.2 వేలు ఆదా..
చాలా ఏండ్లుగా బట్టలు ఇస్త్రీచేసూ ్తజీవనం సాగిస్తున్నాం. మాకు నెలకు రూ.2 వేల వరకు కరెంటు బిల్లు వస్తది. మా పరిస్థితిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ 250 యూనిట్ల వరకు విద్యుత్తు చార్జీలు రద్దు చేయాలని నిర్ణయించారు. కలలో కూడా గిట్ల కరెంటు ఉచితం ఇస్తరు అనుకోలేదు. దీని వల్ల మాకు నెలకు రూ.2 వేల వరకు ఆదా అయితది. జీవితాంతం కేసీఆర్ సర్కారును గుర్తు పెట్టుకుంటం.
మాకు మరింత ప్రయోజనం
క్షౌరవృత్తిదారులకు పట్టణ ప్రాం తాల్లో కొంత ఆర్థిక వెసులుబాటు ఉం టుంది. గ్రామీణ ప్రాంతాల్లోనివారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యుత్తు ఉచితంగా అందించడం వల్ల గ్రామాల్లో సెలూన్లు నిర్వహించే వృత్తిదారులకు మరింత ప్రయోజనం
దక్కనున్నది.
4.5 లక్షల మందికి ప్రయోజనం
లాండ్రీ షాప్లకు, దోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్తు రాయితీ కల్పించడం వల్ల రాష్ట్రంలోని రజక వృత్తిదారులు 4.5 లక్షల మందికి ప్రయోజనం దక్కనున్నది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్తోపాటు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి రజకుల తరఫున కృతజ్ఞతలు.
హామీ నిలబెట్టుకున్నారు
రజక, నాయీబ్రాహ్మణులకు విద్యుత్ చార్జీల రాయితీ కల్పించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇది ఉద్యమ నేతకు మాత్రమే సాధ్యం. ఇటువంటి సాహసోపేత నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రంలోనూ తీసుకోలేదు. ఈ నిర్ణయంతో 2.5 లక్షల మంది క్షౌర వృత్తిదారులకు ప్రయోజనం దక్కనున్నది. ఈ నిర్ణయం వల్ల నాయీబ్రాహ్మణులకు దీర్ఘకాలిక ప్రయోజనం దక్కుతుంది.