సాగర్ బరిలో 41మంది అభ్యర్థులు
మూడు బ్యాలెట్ యూనిట్లు తప్పనిసరి
పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ)/నిడమనూరు : ఈవీఎంల వినియోగంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సరికొత్త రికార్డుగా నిలుస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 41మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికల నిర్వహణకు అదనపు సామగ్రి అవసరం కానున్నది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లను అదనంగా వినియోగించాల్సి ఉన్నది. మొత్తం 346పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో కంట్రోల్ యూనిట్, ఒక్కో బ్యాలెట్ యూనిట్ వినియోగిస్తే సరిపోయేది. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం కంట్రోల్ యూనిట్ల సంఖ్య అంతే ఉన్నా… బ్యాలెట్ యూనిట్ల సంఖ్య మూడింతలు కానున్నది. వరుస క్రమంలో మొదటి యూనిట్లో 1నుంచి 16వరకు రెండో యూనిట్లో 17-32మంది, మూడో యూనిట్లో 33-41వ చివరి అభ్యర్థితో పాటు ‘నోటా’ కూడా పొందుపరుచనున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు తాను కోరుకున్న అభ్యర్థిని ఓటింగ్ యంత్రంలో గుర్తించడం ఇబ్బంది కానున్నది. ఏ మాత్రం గందరగోళానికి గురైనా ఓట్లు తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనుండడంతో ఓటు వేసే సీక్రెట్ కంపార్ట్మెంట్ సైజ్ కూడా పెరుగనున్నది. ఒక్క యూనిట్కు 24X24 X 30(పొడవు, వెడల్పు,ఎత్తు) ఇంచుల సైజ్లో కంపార్ట్మెంట్ సరిపోయేది. కానీ ప్రస్తుతం కంపార్ట్మెంట్ పొడవును 48ఇంచులు(నాలుగు అడుగులు)పెంచాల్సి ఉంది. ఈ మేరకు అదనపు సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
సమీక్షించిన ఎన్నికల పరిశీలకుడు..
ఎన్నికల నిర్వహణపై శనివారం నల్లగొండ కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకుడు సజ్జన్ సింగ్ ఆర్.చవాన్ సమక్షంలో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వారీగా బృందాల ఏర్పాటు కోసం ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. 346 పోలింగ్ బృందాలతో పాటు 20శాతం రిజర్వ్ బృందాలను కూడా నియమించారు. ఒక పోలింగ్ బృందంలో పీఓ, ఏపీఓ, ఇద్దరు ఓపీఓలు ఉంటారు. వీరిలో పీఓ, ఏపీఓలకు ఈ నెల 6,7తేదీల్లో మొదటి విడుత, ఓపీఓలకు ఈ నెల 8,9తేదీల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. రెండో విడుత శిక్షణను ఈ నెల 11,12తేదీల్లో నిడమనూరు మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. సమావేశంలో డీఐఓ గణపతిరావు, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఏఓ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
16నామినేషన్ల ఉప సంహరణ…
నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి నామినేషన్లు సమర్పించిన స్వతంత్ర అభ్యర్థుల్లో 16మంది శనివారం ఉపసంహరించుకున్నారు. వీరిలో బండారు నాగరాజు, రేకల సైదులు, మారం వెంకట్రెడ్డి, పెట్టెం మల్లికార్జున్, జన్ను భరత్, దూడపాక సంజీవ, తండు ఉపేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, ఈసం నాగార్జున్, దొడ్ల వెంకటేశం, కొల్కూర్ ప్రతాప్, పిడిశెట్టి రాజు, వరికోలు శ్రీనివాస్, మహ్మద్ అబ్దుల్ సలీం, డాక్టర్ ఉమ్మడి వెంకట్రెడ్డి, పత్తి నరేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 60మంది నామినేషన్లు ఆమోదం పొందగా 19మంది ఉప సంహరించుకోవడంతో 41మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసిన అనంతరం అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి గుర్తులు కేటాయించారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహ వర్మ, నాయబ్ తాసీల్దార్ రశీద్ పాల్గొన్నారు.
ఇవికూడా చదవండి..
ఉత్తరాఖండ్లో జర్నలిస్టులందరికీ కరోనా టీకా
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
ములుగులో మావోయిస్టుల డంప్ వెలికితీత
ఒడిశాలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ