అమరావతి: మిగ్జాం తీవ్రతుఫాను (Cyclone Michaung) ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బాపట్లకు 110 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను కేంద్రీకృతమైంది. దీంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. తుఫాను కారణంగా నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉదయం 6.30 గంటల వరకు బాపట్లలో 21.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరులో 28.95 సెం.మీ., మచిలీపట్నంలో 14.93 సెం.మీ., కావలిలో 14.26 సెం.మీ., ఒంగోలు 11.44 సెం.మీ., కాకినాడలో 5.9 సెం.మీ., నర్సాపూర్లో 5.85 సెం.మీ., అనకాపల్లిలో 3.35 సెం.మీ., పొదలకూరులో 20.75 సెం.మీ., రేపల్లె 1.17 సెం.మీ., చిత్తూరు 1.25 సెం.మీ., నర్సారావుపేట 1.15 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరణుడు విరుచుకుపడుతున్నాడు. తుఫాను తీవ్రత దృష్ట్యా నిజాంపట్నం హార్బరులో అధికారులు పదో నంబర్ ప్రమాద సూచిక జారీచేశారు. హార్బర్ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచించారు. నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఇక జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చినగంజాం పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి ఉధృతమైంది. కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. గ్రామపంచాయతి కార్యాలయం నీటమునిగింది. ఉధ్రుతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం వస్తున్నది. కాకినాడ, పిఠాపురం, పెద్దపురంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జగ్గంపేట, పత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఈదురుగాలులతో పలు మండలాల్లో వరిపంట నేలకొరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసి ముద్దయ్యాయి.
నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలోని 9 మండలాల్లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. నెల్లూరు, కావలి, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. వర్షం, ఈదురుగాలులతో చలి తీవ్రత పెరిగిపోయింది.
#WATCH | Andhra Pradesh: District officials are on high alert as #CycloneMichuang is anticipated to make landfall between Nellore and Machilipatnam, prompting a series of precautionary measures across the region
(Visuals from Vijayawada) pic.twitter.com/IG4bBm6gj7
— ANI (@ANI) December 4, 2023
విజయవాడలో రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతున్నది. దీంతో ఇంద్రాకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాత్రి వర్షం కురుస్తున్నది. దీంతో అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరపిలేకుండా వర్షం పడుతున్నది. నాగాయలంకలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
— Civil Learning (@CivilLearning1) December 5, 2023
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం వస్తున్నది. దీంతో వేల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఒక్కో గేటును ఎత్తి టీటీడీ అధికారులు నిటిని విడుదల చేస్తున్నారు.